చర్ల, జూన్ 12 : తమదైన సంస్కృతీ సంప్రదాయాలతో జీవించే ఆదివాసీల్లో.. మెల్లగా నాగరికతవైపు వైపు అడుగులు వేయాలన్న తపన కనిపిస్తోంది. ఇప్పటికే వేష భాషల్లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. కొంతమంది యువకుల దృష్టి అధునాతనమైన భవనాలపై పడింది. ఈ క్రమంలో తన ఇల్లు కూడా అలాగే ఉండాలన్న ఆలోచనలోపడ్డాడు ఓ ఆదివాసీ యువకుడు. స్వయంగా శ్రమించి తన కలలకు రూపమైన ఇంటిని నిర్మించుకున్నాడు. అతడే చర్ల మండలంలోని మారుమూల ఆదివాసీ గ్రామమైన రాళ్లాపురానికి చెందిన పొడియం ఐతయ్య. తనకంటూ ప్రత్యేకమైన ఇల్లు ఉండాలన్న తపనతో రూ.75 వేలు ఖర్చు చేసి తన అభిరుచికి తగ్గట్టుగా ఇంటిని నిర్మించుకున్నారు. కనీస రహదారి సౌకర్యం కూడా లేని ఆ గ్రామానికి చేరాలంటూ సుమారు 5 కిలోమీటర్లు అడవి మార్గంలో నడవాలి. ఆ గ్రామంలో ప్రవేశించగానే ఐతయ్య నిర్మించుకున్న ఇల్లు ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.
నేనే డిజైన్ చేసి కట్టుకున్నా..
నేను రోజూ కూలి పనికిపోతున్నాను. మంచి ఇల్లు మోడల్గా కట్టుకోవాలని అనుకున్నాను. సొంతంగా డిజైన్ చేసుకొని రెండు అంతస్తుల ఇల్లు కట్టుకున్నాను. ముందుగోడలు కట్టాను. స్లాబుకు బదులు చెక్కలు ఉపయోగించాను. పైన మరో అంతస్తు ఏర్పాటుచేశాను. దాన్ని పెంకుతో కప్పాను. పైకి ఎక్కేందుకు కర్రతో మెట్లు చేయాలనుకుంటున్నాను. నేను కట్టుకున్న ఇల్లు అడవిలో అందంగా ఉందంటున్నారు.
-పొడియం ఐతయ్య, రాళ్లాపురం