మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి
ఎమ్మెల్యే దివాకర్రావుతో కలిసి మాతాశిశు దవాఖాన భవనం పనుల పరిశీలన
హాజీపూర్, మే 13 : జూన్ 15 లోగా పనులు పూర్తి చేయాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే దివాకర్రావుతో కలిసి జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో నిర్మిస్తున్న మాతా శిశు దవాఖాన భవనాన్ని పరిశీలించారు. పనుల జాప్యంపై ఎస్.ఎమ్.ఐ.డీ.సీ అసిస్టెంట్ ఇంజనీర్ రమేశ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు భవనాన్ని త్వరగా అందుబాటులోకి తేవాలన్నారు. కాలేజీ రోడ్డు నుంచి దవాఖాన వరకు సింగరేణి సహకారంతో తాత్కాలిక గ్రావెల్ రోడ్డు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భవనం ప్రారంభంలోగా మౌలిక సదుపాయాలు, ఆపరేషన్ థియేటర్లు, పడకలు, పరికరాలు సిద్ధం చేయాలని ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ అరవింద్కు సూచించారు. జాతీయ రహదారుల శాఖ సౌజన్యంతో వారంలోపు ఆక్సిజన్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
బెల్లంపల్లి టౌన్, మే 13: సింగరేణి ఏరియా దవాఖానలోని ఐసోలేషన్ కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఆక్సిజన్ ప్లాంట్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ భారతీ హోళికేరీ అధికారులను ఆదేశించారు. ఐసోలేషన్ కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు. ప్లాంట్ అందుబాటులోకి వస్తే కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. 45రోజుల్లోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జీఎం బల్లారి శ్రీనివాస్ను ఆదేశించారు. కరోనా బాధితుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 83 మంది బాధితులు ఉండగా, 20 మంది డిశ్చార్జి అయ్యారని , 63 మంది చికిత్స పొందుతున్నారని వారు తెలిపారు. కేంద్రాన్ని 200 పడకలుగా అప్గ్రేడ్ చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, అందుకు తగిన సదుపాయాలు, వసతుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట డీసీహెచ్ఎస్ అరవింద్, నోడల్ అధికారులు అనిల్, రాధాకృష్ణ ఉన్నారు.