ఖమ్మం, మే 13: ఖమ్మం నగర పాలక సంస్థ మేయర్గా ఎన్నికైన పునుకొల్లు నీరజ గురువారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సమక్షంలో కేఎంసీ కమిషనర్ అనురాగ్ జయంతి.. తొలి దస్త్రంపై మేయర్తో సంతకం చేయించారు. మేయర్ బాధ్యతలు స్వీకరించడానికి ముందుకు సర్వమత ప్రార్థనలు జరిపి ఆశ్వీరచనాలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న సందర్భంగా డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్రా పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగర అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారంలో వేగంగా స్పందించాలని సూచించారు. అధికారులు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్లు కమర్తపు మురళి, కర్నాటి కృష్ణ, శీలంశెట్టి రమ, రాపర్తి శరత్ తదితరులు పాల్గొన్నారు.