ఇక సిరిసిల్లలో సీటీ స్కాన్ ధర 2500
అమాత్యుడి ఆదేశాలతో ప్రైవేట్ సంస్థల నిర్ణయం
ప్రజలపై తప్పనున్న ఆర్థికభారం
సర్వత్రా హర్షం
సిరిసిల్ల/సిరిసిల్లటౌన్, మే 12:కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న మంత్రి కేటీఆర్, బుధవారం మరో అడుగు ముందుకు వేశారు. కరోనా నిర్ధారణకు చేసే హెచ్ఆర్సీటీ స్కాన్ ఫీజు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు ధరలు తగ్గించాలని సిరిసిల్లలోని ప్రైవేట్ దవాఖానలకు ఆదేశాలు జారీ చేయగా, నిర్వాహకులు సానుకూలంగా స్పందించారు. స్కానింగ్ ఫీజు 5500 నుంచి 2500 అంటే సగానికిపైగా తగ్గించగా, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సిరిసిల్లలోని ప్రైవేట్ సీటీ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు స్కానింగ్ ఫీజు తగ్గించారు. సిరిసిల్ల పట్టణంలో రెండు, వేములవాడలో ఒకటి చొప్పున జిల్లాలో మూడు ప్రైవేట్ సీటీ స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. అయితే కరోనా నిర్ధారిత పరీక్షలైన హెచ్ఆర్సీటీ (హై రెసొల్యూషన్) ధర ప్రస్తుతం రూ.5500గా ఉంది. ఫలితంగా స్కానింగ్ కేంద్రాలకు వచ్చే పేదలపై ఆర్థిక భారం పడుతుండగా, విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తించారు. హెచ్ఆర్సీటీ ధర రూ. 2500కు తగ్గించాలని నిర్వాహకులను కోరగా, సానుకూలంగా స్పందించారు. గురువారం నుంచి సిరిసిల్ల జిల్లాలో రూ.2500కే హెచ్ఆర్సీటీ పరీక్షలు చేయనున్నట్లు కేంద్రాల నిర్వాహకులు తెలిపారు. పరీక్షలు చేసి రిపోర్టులు అందిస్తామని, ఫిల్మ్ అవసరం ఉంటే మరో వెయ్యి అదనంగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. కాగా, అమాత్యుడి పిలుపు మేరకు ప్రైవేటు యాజమాన్యాలు పేద ప్రజల సౌకర్యార్థం స్కానింగ్ ఫీజు తగ్గించడం హర్షనీయమని కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఎంహెచ్వో సమన్మోహన్రావు పేర్కొన్నారు. ధరల తగ్గింపు వల్ల ఎక్కువ సంఖ్యలో ప్రజలు పరీక్షలు చేయించుకునే వీలు కలుగుతుందని చెప్పారు. తద్వారా వ్యాధి తీవ్రతను తెలుసుకొని వైద్యసేవలు పొందే వీలుంటుంది. ఖరీదైన పరీక్షలను పేదలకు అందుబాటులో తెచ్చిన మంత్రి కేటీఆర్కు ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు.