ఉదయం 5 గంటలకే తెరుచుకున్న ఆదిలాబాద్ మార్కెట్
10 గంటలకు స్వచ్ఛందంగా మూసివేత
ఎదులాపురం, మే 12: కరోనా తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి లాక్డౌన్ అమలు చేసింది. పది రోజుల పాటు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రజలు వివిధ పనులు చేసుకునేందుకు సడలింపు ఇచ్చింది. లాక్డౌన్ ప్రతి రోజూ 20 గంటల పాటు ఉండాలని నిర్ణయం తీసుకోవడంతో జిల్లా ప్రజలు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్లో ఉదయం 5 గంటలకు మార్కెట్ తెరిచారు. ప్రజలు బట్టలు, నిత్యావసర సరుకుల కోసం బారులు తీరారు. మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. బస్టాండ్లో ఉదయం 10 గంటల లోపు వెళ్లి వచ్చే రూట్లలో బస్సులు నడిపారు. 10 గంటల తర్వాత వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర ఆదేశాల మేరకు ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు అక్కడక్కడా పికెటింగ్ నిర్వహించారు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయటకు వచ్చిన వారికి జరిమానా విధించారు.
బేలలో..
బేల, మే 12: మండల కేంద్రంతో పాటు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో సంపూర్ణ లాక్డౌన్ పాటించారు. ప్రతి బుధవారం వారంతపు సంత ఉంటుంది. సంతకు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల నుంచి వచ్చే చిరువ్యాపారులను అరిక్టటేందుకు గ్రామస్తులు ఇలా నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఐ సాయన్న సూచన మేరకు పోలీసులు వివిధ గ్రామాల్లో బందోబస్తు నిర్వహించారు. లాక్డౌన్ సమయం తర్వాత బయటకు వచ్చిన వారికి జరిమానా విధించారు.
జైనథ్లో..
జైనథ్, మే 12: మండలంలో 10 గంటల తర్వాత దుకాణాలు, మార్కెట్ను బంద్ చేశారు. దవాఖానాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు యథావిధిగా కొనసాగాయి. అంతర్రాష్ట్ర రహదారి డొల్లార వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు.
ఉట్నూర్లో..
ఉట్నూర్, మే 12: మండల కేంద్రంలో ఉదయం కూరగాయలు, కిరాణా దుకాణాల వద్ద సందడి నెలకొంది. పది గంటల తర్వాత ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పట్టణంలోని ప్రధాన రహదారులు, అంబేద్కర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, వినాయక్చౌక్లు వెలవెలబోయాయి. పరిమిత సమయం కారణంగా ఉట్నూర్ ఆర్టీసీ డిపో నుంచి నాలుగు బస్సులు మాత్రమే జిల్లా కేంద్రానికి పంపారు. ప్రయాణికులు లేక బస్టాండ్ ఖాళీగా కనిపించింది.
పోలీసుల పర్యవేక్షణ..
పట్టణంలోని ప్రధాన రహదారిలో ఉట్నూర్ డీఎస్పీ ఉదయ్ కుమార్, సీఐ నరేశ్, ఎస్ఐ సుబ్బారావు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. లాక్డౌన్ను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు జరిమానా విధించారు.
నార్నూర్, గాదిగూడ మండలాల్లో..
నార్నూర్, మే 12: కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్ నార్నూర్, గాదిగూడ మండలాల్లో సంపూర్ణంగా కొనసాగింది. నార్నూర్ సర్కిల్ సీఐ ప్రేమ్కుమార్ మండల కేంద్రంతో పాటు గాదిగూడ మండలంలోని లోకారి(కే) గ్రామాన్ని సందర్శించారు. కొవిడ్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని, అనవసరంగా బయట తిరగవద్దని గ్రామస్తులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట లోకారి సర్పంచ్ మెస్రం దేవ్రావ్, ఎస్ఐలు డీ రాజు, సయ్యద్ ముజాహిద్, ఏఎస్ఐ గంగారెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఇంద్రవెల్లిలో..
ఇంద్రవెల్లి, మే 12: మండల కేంద్రంలో ఎస్ఐ నాగ్నాథ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 10 గంటలకు దుకాణాలు మూసివేయాలని వ్యాపారులకు సూచించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.