తొలిరోజూ లాక్డౌన్ సూపర్ సక్సెస్
సబ్బండ వర్గాల సంపూర్ణ సహకారం
ఉదయం 6-10 గంటల వరకు కార్యకలాపాలు
స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపారులు
నిర్మానుష్యంగా జాతీయ రహదారులు
రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు
మంచిర్యాల, మే 12, నమస్తే తెలంగాణ : కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ మొదటి రోజు బుధవారం సం పూర్ణంగా ముగిసింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఇవ్వడంతో నిత్యావసరాలు ఆసమయంలోనే కొనుగోలు చేశారు. రేషన్ షాపులు, మద్యం, ఇతర దుకాణాలు 10 గంటల వరకే తెరిచి ఉంచారు. అనంతరం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర సేవలందించే ఉద్యోగులను మాత్రమే గుర్తింపు కార్డులతో అనుమతించారు. ఆర్టీసీ బస్సులు సైతం సూచించిన నాలుగు గంటలే తిరిగాయి. రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏ ర్పాటు చేసి రాకపోకలను నియంత్రించారు.
రోడ్లన్నీ నిర్మానుష్యం..
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు 10 రోజుల పాటు లాక్డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఇచ్చింది. ఆ సమయంలో మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయి. మిగతా 20 గంటల పాటు లాక్డౌన్ కఠినంగా అమలులో ఉంటుంది. దీంతో ఉదయం 10 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర సేవల్లో ఉన్నవారు మాత్రమే రోడ్లపైకి వచ్చారు. మిగతా ఉద్యోగులు 33 శాతంతో విధులు నిర్వహించాల్సి ఉండగా, ఆ మేరకు గుర్తింపుకార్డులతో ప్రయాణాలు సాగించారు. సామూహిక కార్యక్రమాలతోనే వైరస్ వ్యాప్తి చెందుతున్నదనే ఉద్దేశంతో కర్ఫ్యూ విధించడంతో ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలంతా సంతోషం వ్యక్తం చేశారు.
సరిహద్దుల్లో చెక్ పోస్టులు..
లాక్డౌన్ సందర్భంగా కోటపల్లి మండలంలోని రాపనపల్లి- సిరొంచ అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద చెన్నూర్ రూరల్ సీఐ, కోటపల్లి ఎస్ఐ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. మినహాయింపు ఉన్నవారి గుర్తింపు కార్డులు పరిశీలించారు. జైపూర్ మండలంలోని ఇందారం క్రాస్ రోడ్డు వద్ద మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, జైపూర్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. కర్ఫ్యూ సమయంలో మెడికల్, సిం గరేణి, రెవెన్యూ, ఎలక్ట్రికల్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారి కి మాత్రమే మినహాయింపు ఉందని, మిగతావారు అనవసరంగా బయటకు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జన్నారం నుంచి నిర్మల్, ఆదిలాబాద్ వైపు, బెల్లంపల్లి మీదుగా ఆసిఫాబాద్, మహారాష్ట్ర వైపు వాహనాలను సరిహద్దుల్లో తనిఖీ చేశారు.
నాలుగు గంటలే ఆర్టీసీ సేవలు..
మంచిర్యాల డిపో పరిధిలోని ఆరు రూట్లలో ఏడుబస్సులు మా త్రమే రాకపోకలు సాగించనుండగా, హైదరాబాద్ సహా మిగిలిన రూట్లలో బస్సులను పూర్తిగా రద్దు చేశారు. డిపో పరిధిలో 140 బస్సులకు గాను, ఇందులో 61 అద్దె బస్సులు ఉన్నాయి. అద్దె బస్సులు డిపోకే పరిమితం కావడంతో పాటు లాక్డౌన్ నేపథ్యంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకే బస్సుల రాకపోకలు కొనసాగిస్తున్నారు.
ఆసిఫాబాద్,మే12: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. బుధవారం మొదటి రోజు జిల్లావ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్లో పాల్గొన్నారు. ప్రజలు పూర్తిగా సహకారం అందిస్తే కట్టడి చేయడం సాధ్యమవుతుందని అధికారులు కోరుతున్నారు. కాగజ్నగర్లో ప్రధాన మార్కెట్ ఏరియాలో ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర లాక్డౌన్ను పరి శీలించారు. ఆసిఫాబాద్లో డీఎస్పీ అచ్చేశ్వర్రావు ప్రధాన రహదారి వద్ద 10 గంటల తర్వాత బయకు వచ్చిన ప్రజలకు అవగాహన కల్పించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వా హనాలను తనిఖీ చేయడంతో పాటు ప్రత్యేక పాసు తీసు కోవాలని సూచించారు. వాంకిడిలో సీఐ సుధాకర్, ఎస్ఐ రమే శ్ వాహనాలను తనిఖీ చేశారు. చింతలమానేపల్లి మండ లం గూడెం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో పోలీసులు డ్రోన్ కెమెరాలతో లాక్డౌన్ను పర్యవేక్షించారు.
గూడెం ఆలయం మూసివేత
దండేపల్లి, మే12: మండలంలోని గూడెం శ్రీసత్యనారా యణస్వామి ఆలయాన్ని బుధవారం నుంచి మూసివేసినట్లు ఆలయ ఈవో వడ్లూరి అనూష తెలిపారు. ప్రతిరోజూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉదయం స్వామివారికి అభిషేకం, అర్చన, హారతి, నైవేద్యాలను అర్చకులు, వేదపండితులు మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో నివేదన లాంటి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసివేయనున్నారు.