వానకాలంలో 5.88 లక్షలు, యాసంగిలో1.20 లక్షల ఎకరాల్లో సాగు
ధాన్యం నిల్వకు గోదాంలను నిర్మించాలని డీసీసీబీ ప్రణాళిక
8 గోదాంల నిర్మాణానికి నాబార్డు నిధులు మంజూరు
రెండో విడుతలో మిగిలిన ప్రాంతాల్లోనూ గోదాంల నిర్మాణం
అన్నదాతలకు ఇబ్బందులు తలెత్తకుండా డీసీసీబీ చర్యలు
పరిగి, అక్టోబర్ 11:వికారాబాద్ జిల్లాలో పంటల ఉత్పత్తులు పెరుగుతున్నాయి. అన్నదాతలకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం నిల్వ కోసం గోదాంలను నిర్మించేందుకు డీసీసీబీ ప్రణాళికను రూపొందిస్తున్నది. ఈ వానకాలం 5.88లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా, అధిక దిగుబడులు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న గోదాంలు సరిపోక ఫంక్షన్ హాళ్లు, అద్దె భవనాల్లో ధాన్యం నిల్వ చేశారు. ఈ యాసంగిలోనూ 1.20 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ధాన్యం నిల్వకు ఇబ్బందులు కలుగకుండా డీసీసీబీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో 17 సొసైటీలు ఉండగా, మొదటి విడుతలో 8 గోదాంల నిర్మాణానికి నాబార్డు నుంచి నిధులు మంజూరయ్యాయి. ఒకట్రెండు చోట్ల గోదాంల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రెండో విడుతలో మిగిలిన సొసైటీల పరిధిలో గోదాంలను నిర్మించనున్నారు.
జిల్లాలో సాగు విస్తీర్ణంతోపాటు పంట ఉత్పత్తులు పెరిగాయి. దీంతో అందుకు తగ్గట్లుగా గోదాంల నిర్మాణానికి డీసీసీబీ కసరత్తు చేస్తున్నది. వానకాలం, యాసంగి రెండు సీజన్లలో వివిధ రకాల పంటల సాగు విస్తీర్ణంతోపాటు ఉత్పత్తులు గతంలో కంటే అధికంగా ఉన్నాయి. గత యాసంగిలో ఊహించిన దాని కంటే అధికంగా ధాన్యం ఉత్పత్తి జరుగగా, స్టాకు నిల్వ చేసేందుకు సరిపడా గోదాంలు లేకపోవడంతో ఇతర జిల్లాలకు ధాన్యం తరలించారు. కొన్నిచోట్ల ఫంక్షన్ హాళ్లలో ధాన్యం నిల్వచేశారు. ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో చోటుచేసుకోకుండా, వ్యవసాయ ఉత్పత్తులకు సరిపడా గోదాంలు నిర్మించడానికి డీసీసీబీ ముందుకొచ్చింది. వికారాబాద్ జిల్లాలో వానకాలంలో 5.88 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. యాసంగిలో సుమారు 1.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నారు.
జిల్లాలో 8 గోదాంల నిర్మాణం
డీసీసీబీ ఆధ్వర్యంలో నాబార్డు నిధులతో వికారాబాద్ జిల్లాలో 8 గోదాంల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. జిల్లావ్యాప్తంగా 17 సొసైటీలు ఉండగా మొదటి విడుతలో 8 గోదాంలు నిర్మిస్తున్నారు. రెండో విడుతలో మిగతా ప్రాంతాల్లో గోదాంలు నిర్మించనున్నారు. తట్టేపల్లిలో వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రైతుల శిక్షణ కేంద్రం, పూడూరులో 1500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల రెండు గోదాంలు, పరిగి మండలం రాఘవాపూర్లో వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం, శివారెడ్డిపేట్లో 2,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం, మర్పల్లిలో 2,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం, మేకవనంపల్లిలో 2,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం, వట్టిమీనంపల్లిలో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం, కులకచర్లలో 2,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం, రైస్మిల్ నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన నిధులను నాబార్డు మంజూరు చేస్తున్నది. ఒకటీ రెండుచోట్ల గోదాంల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
తక్కువ వడ్డీకి రుణాలు..
డీసీసీబీ సహకారంతో సొసైటీల ఆధ్వర్యంలో గోదాంల నిర్మాణానికి అతి తక్కువ వడ్డీకి నాబార్డు నిధులు మంజూరు చేస్తున్నది. వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి రూ.65 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో 10 శాతం నిధులు ఆయా సొసైటీలు భరించాల్సి ఉంటుంది. మిగతా 90 శాతం నిధులు నాబార్డు తక్కువ వడ్డీకి ఇస్తున్నది. 4 శాతం వడ్డీకి రుణం మంజూరు చేసే నాబార్డు, ఆ తర్వాత 3శాతం రిబేట్గా ఇస్తున్నది. తద్వారా ఒక శాతం వడ్డీకి రుణాలు పొందే సదుపాయం నాబార్డు కల్పిస్తున్నది. గోదాంల నిర్మాణానికి అవసరమైన స్థలం ఎంపిక చేసి కేటాయింపులు చేస్తే సాధ్యమైనంత త్వరగా వాటి నిర్మాణ పనులు చేపట్టేందుకు డీసీసీబీ సైతం ప్రోత్సాహం అందజేస్తున్నది.
స్థానికంగా స్టాకు.. సొసైటీలకు ఆదాయం
గోదాంల నిర్మాణంతో ఎక్కడికక్కడే మండలాల్లో వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసుకునే అవకాశం కలుగుతుంది. వానకాలం, యాసంగి సీజన్లలో ఒకేసారి వ్యవసాయ ఉత్పత్తులు వచ్చినపుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నా.. సరిపడేస్థాయిలో గోదాంలు లేకపోవడంతో ఇబ్బందికరంగా ఉంటున్నది. ప్రతి మండలంలో ఒక గోదాంతోపాటు అదనంగా గోదాంలు ఏర్పాటు చేస్తుండడంతో వ్యవసాయ ఉత్పత్తులను అధికంగా నిల్వ చేసే అవకాశం ఉంటుంది. ఆయా సొసైటీలకు అద్దెల రూపంలో ఆదాయం సమకూరుతుంది.
వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు అవకాశం
ప్రతి సొసైటీ ఆధ్వర్యంలో గోదాంల నిర్మాణానికి రూపకల్పన చేస్తున్నారు. ఆయా సొసైటీల పరిధిలో గోదాంల నిర్మాణానికి నాబార్డు రుణాలిచ్చేందుకు సిద్ధంగా ఉంది. గోదాంల నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను స్థానికంగానే నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఆయా సొసైటీలకు అద్దె రూపంలో ఆదాయం సమకూరుతుంది. రెండు, మూడేండ్లలో అన్ని సొసైటీల్లో గోదాంల నిర్మాణం పూర్తి చేస్తాం.
-బుయ్యని మనోహర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్