చటాన్పల్లిలో మురుగు కాలువ
నిర్మాణ పనులు చేస్తుండగా ఘటన
షాద్నగర్, అక్టోబర్11: కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. కనీస రక్షణ చర్యలు లేకుండానే కూలీలు పనులు చేస్తుండగా అకస్మాత్తుగా మట్టి దిబ్బలు కూలి ఇద్దరు దినసరి కూలీలు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన సోమవారం షాద్నగర్ పట్టణంలో జరిగింది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఫరూఖ్నగర్ మండలం ఉప్పరిగడ్డ తండాకు చెందిన శ్రీను (38), కృష్ణయ్య (37)లతో పాటు మరో వ్యక్తి దినసరి కూలీలుగా ఉపాధిపొందుతున్నారు. ఇందులో భాగంగానే షాద్నగర్ మున్సిపాలిటీలోని 4వ వార్డు చటాన్పల్లి, రాంనగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న అంతర్గత మురుగు కాలువల నిర్మాణ పనులను చేసేందుకు ముగ్గురు కూలీలు వచ్చారు. కాలువలోకి దిగి సిమెంట్ పైపులను బిగిస్తుండగా అకస్మాత్తుగా మట్టి దిబ్బలు కూలి ముగ్గురు కూలీలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో శ్రీను, కృష్ణయ్యలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో కూలీకి ప్రమాదం తప్పింది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు.
ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా సంబంధిత కాంట్రాక్టర్ కూలీలతో పనిచేయించాడని, అతడి నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇదిలా ఉంటే మృతుల కుటుంబాలను ఆదుకోవాలని యువజ సంఘాల సభ్యులు, పలు పార్టీల నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. మృతదేహాలను తరలించకుండా అడ్డుకున్నారు. ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియాను చెల్లించాలని డిమాండ్ చేశారు. సంబంధిత కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా షాద్నగర్ పోలీసులు గట్టిబందోబస్తు నిర్వహించారు. మృతదేహాలను షాద్నగర్ సర్కారు దవాఖానకు తరలించారు.