ఏటూరునాగారం, జూలై 11: తుపాకులగూడెం బ్యారేజీని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని, అదే సమయంలో ములుగు వేదికగా పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపనున్నారని జడ్పీ చైర్మన్ కుసుము జగదీశ్వర్ అన్నారు. చిన్నబోయినపల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గ్రామంలో నెలకొన్న పోడు భూముల సమస్య, అంతర్గత రోడ్ల దుస్థితిని గ్రామస్తులు జడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పల్లెప్రగతిలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, డీఎఫ్వో ప్రదీప్కుమార్ శెట్టితో పోడు భూములపై మాట్లాడినట్లు ఆయన తెలిపారు. కొత్తగా పోడును ప్రోత్సహించబోమని, పాత పోడు భూములను విస్మరించబోమని తెలిపారని జగదీశ్వర్ చెప్పారు. అటవీశాఖ అధికారులు పాత పోడుభూముల జోలికి వస్తే తనకు తెలియచేయాలన్నారు. చిన్నబోయినపల్లిలోని అంతర్గత రోడ్లకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
చిన్నబోయినపల్లికి మంజూరైన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థలం లేదని గ్రామస్తులు తెలుపగా వెంటనే తహసీల్దార్ రవీందర్ను స్థలం కేటాయించాలని జడ్పీ చైర్మన్ ఆదేశించారు. గోగుపల్లిలో పర్యటించిన జడ్పీ చైర్మన్కు నాలుగు సీసీ రోడ్లు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరగా అందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ప్రమాదంలో గాయపడిన ఎంపీపీ భర్త ఫత్తే మహ్మద్, గోగుపల్లిలో అనారోగ్యంతో ఉన్న మాజీ సర్పంచ్ యాలం రాంబాబు, ఇటీవల ఇర్సవడ్ల భాస్కర్ మృతి చెందగా బాధిత కుటుంబాన్ని జడ్పీ చైర్మన్ పరామర్శించారు. కార్యక్రమాల్లో జడ్పీకోఆప్షన్ సభ్యురాలు వలియాబీ, ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు తుమ్మ సంజీవరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్, సర్పంచ్ సిద్దబోయిన సమ్మక్క, వంక దేవేందర్, గోవింద్ నాయక్, సిద్దబోయిన రాంబాబు, నాయకులు తుమ్మ మల్లారెడ్డి, ఇబ్రహీం, ఆడెపు వెంకన్న, జీ.కృష్ణారెడ్డి, సప్పిడి రాంనర్సయ్య, భోజారావు, చంద్రబాబు, వావిలాల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.