రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిధులు విడుదల
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
మంత్రి గంగులకు జీవో కాపీని స్వయంగా అందించిన ముఖ్యమంత్రి
కరీంనగర్, జూన్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;‘మానేరు రివర్ ఫ్రంట్’ నిర్మాణానికి మరో అడుగు పడింది. 4 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణానికి తాజాగా 310.46 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించిన జీవో కాపీని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్లో స్వయంగా మంత్రి గంగుల కమలాకర్కు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. డీపీఆర్ తయారీ, టెండర్ ఖరారుకు విధివిధానాలను రూపొందించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మంత్రి గంగుల, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో శనివారం సమన్వయ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. కాగా, రివర్ ఫ్రంట్లో భాగంగా 80 కోట్ల వ్యయంతో చెక్డ్యాంల నిర్మాణం, 190 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఇప్పటికే చేపట్టారు.