వానకాలం సాగుకు రెడీ
వనపర్తి జిల్లాలో 2.71 లక్షల ఎకరాలు
గతేడాది కంటే 35,920 ఎకరాలు అధికం
అంచనాలు రూపొందించిన అధికారులు
వనపర్తి, మే 11 : వనపర్తి జిల్లాలో వానకాలం సాగుకు సంబంధించిన ప్రణాళికలను అధికారులు రూపొందిం చారు. 2,71,170 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు అధికారుల అంచనా. గతంతో పోలిస్తే ఈ ఏడాది కందులు, జొన్న, మొక్కజొన్న, పత్తి ఎక్కువగా సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రైతులకు వానకాలం సాగుపై అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పంటల సాగు లక్ష్యాలకు అనుగుణంగా ఏ భూముల్లో ఏ పంటలు అనుకూలమనే దిశగా పరిశీలన చేసి రైతులకు మండల, క్లస్టర్ స్థాయిలో అవగాహన కల్పించారు. జిల్లాలో సన్న రకం వరికి మొదటి ప్రాధాన్యతతోపాటు కంది, పత్తి, ఇతర పంటల సాగు చేయాలని అధికారులు నిర్ధేశించారు. 2019 వానకాలంలో 2,21,066 ఎకరాలు, గతేడాది 2,35,250 ఎకరాల్లో సాగు చేయగా.. ఈ ఏడాది 2,71,170 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అధికారుల అంచనా. కాగా, గతేడాది కంటే ఈ సారి 35,920 ఎకరాల్లో పంటలు అధికంగా సాగు చేయనున్నారు.
లాభాలు వచ్చే పంటలు వేయాలి
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేస్తే రైతులకు లాభం చేకూరే అవకా శాలు మెండుగా ఉంటాయి. వరిలో ఆర్ఎన్ఆర్ పంటకు తెలంగాణ సోనా అని పేరుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది మంచిగా పనిచేస్తుంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది 15వేల ఎకరాల్లో పత్తి అధికంగా సాగవుతుందని భావిస్తున్నాం. గతంలో కంటే 35,920 ఎకరాల్లో సాగు అధికంగా అవుతుందని అంచనా.