కాళేశ్వరం ప్రాజెక్టుతో పుష్కలంగా జలాలు
యాసంగిలో రికార్డు స్థాయిలో వరి సాగు
నాటి బీడు భూముల్లో ధాన్యపురాశులు
అంచనాలకు మించి రికార్డు స్థాయిలో దిగుబడి
కేంద్రాలకు పోటెత్తుతున్న ధాన్యపు రాశులు
చివరి గింజ వరకూ కొనాలని నిర్ణయం
ఇప్పటి వరకు 600 కోట్లకుపైగా విలువైన వడ్లు కొనుగోలు
మరో మూడు రోజుల్లో 50 కోట్ల విలువైన పంట వచ్చే అవకాశం
వెనువెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
అన్నదాతల్లో ఆనందం
రాజన్న సిరిసిల్ల, జూన్ 10 (నమస్తే తెలంగాణ):మెట్టప్రాంతం రాజన్న సిరిసిల్ల జిల్లా స్వరాష్ట్రంలో మాగాణిలా మారింది. కరువు కోరల నుంచి బయటపడి, నేడు కాళేశ్వరం జలాలతో పునర్జీవం పోసుకొని సస్యశ్యామలమైంది. దశాబ్దాల కాలంగా సాగునీటి కోసం ఎదురు చూసిన అన్నదాతకు భరోసా ఇచ్చింది. చరిత్రలోనే మొదటిసారిగా యాసంగిలో రికార్డు స్థాయిలో వరి సాగు కాగా, అంచనాలకు మించి దిగుబడి వచ్చింది. కోట్లాది రూపాయల పంట పండగా, చెంతనే కొనుగోళ్లతో చింత లేకుండా పోయింది. ఎక్కడా ఇబ్బందుల్లేకుండా అమ్మిన రెండు మూడు రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండగా రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. సాగునీటి గోస తీర్చిన మంత్రి కేటీఆర్కు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నది.
సిరిసిల్ల ఒకప్పుడు కరువునేల. సాగునీటికి తండ్లాడిన మెట్టప్రాంతం. వానకాలం వర్షాల మీద ఆధారపడి సాగు చేసినా, యాసంగిలో మాత్రం ఎక్కువగా బీళ్లే కనిపించే వి. అసలే అరకొరగా వేసిన పంటలకు చివరలో నీరందక ఎండిపోయేది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అందుబాటులోకి వచ్చి న తర్వాత పరిస్థితి మారుతున్నది. కాలంతో సంబంధం లేకుండా గోదారి జలాలు జిల్లా నలుమూలలకూ చేరడంతో సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. శ్రీరాజరాజేశ్వర జలాశయం నిండుకుండలా మారింది. చెరువులు, కుంటలు మ త్తళ్లు దూకాయి. ఇటు భూగర్భజలాలు పెరిగాయి. ఏకంగా ఆరుమీటర్లు పైకి చేరాయి. దాంతో నాడు బీడుగా భూములు సాగులోకి వచ్చాయి. రైతు లు పూర్తి స్థాయిలో సేద్యంవైపు మళ్లారు. గుంట భూమిని వదలకుండా వరివేశారు. యాసంగిలో 1.68 లక్షల ఎకరాలు సాగు చేశారు. పంటలను కాపాడాలన్న మంత్రి కేటీఆర్ తాపత్రయంతో ఏప్రిల్ కాళేశ్వర జలాలను విడుదల చేశారు. ఎగువమానేరుతోపాటు చెరువులు, కుంటలను నింపారు. నట్టనడి ఎండల్లో ఎగువ మానేరు మత్తడి దుంకగా, రైతు లు సంబురపడ్డారు. ఇత తమ పంటలకు ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు.
అంచనాలకు మించి దిగుబడి..
గతంతో పోలిస్తే యా సంగిలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 1.68లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని యంత్రాంగం అంచనా వేసింది. అప్పుడు 3.10 లక్ష ల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యం విధించుకున్నది. అయి తే ఈసారి సిరులపంట పండింది. ఒక్కో రైతుకు 30 క్వింటాళ్ల నుంచి 35 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. అంచనాలకు మించి దిగుబడి వస్తుండడంతో సేకరణ లక్ష్యం మారింది. 3.50 లక్షల మెట్రిక్ టన్నులు కొనాలని నిర్ణయించింది.
కోట్లాది రూపాయల పంట..
కరోనా వేళ ఇబ్బంది పడద్దన్న ఉద్దేశంతో సర్కారు రైతు ముంగిట్లోనే కొనుగోళ్లు చేపట్టింది. జిల్లాలోని 255 పంచాయతీల పరిధిలో 236 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. సెంటర్లకు ధాన్యం పోటెత్తగా, మద్దతు ధరతో కొంటున్నది. బుధవారం వరకు 44,190 మంది రైతుల నుంచి 600కోట్ల విలువైన 3,18 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నది. 32,666 మంది రైతులకు 402 కోట్లు చెల్లించింది. మిగతా వారికి త్వరలోనే చెల్లించనున్నది. ఇంకా కేంద్రాలకు ధాన్యం వస్తుండగా, చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలని యంత్రాంగం నిర్ణయించింది. మరో 30వేల మెట్రిక్ టన్నులు వరకు రావచ్చని అంచనా వేసింది. 40 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయని, మరో మూడు నాలుగు రోజుల్లో అన్ని కేంద్రాల్లో పూర్తవుతాయని చెబుతున్నది. కొన్న ధాన్యాన్ని వెనువెంటనే రైస్మిల్లులకు తరలిస్తున్నది. ఇక్కడ మిల్లుల్లో స్థలం సరిపోకపోవడంతో కరీంనగర్, పెద్దపల్లి రైస్మిల్లులకు లక్ష మెట్రిక్ టన్నులు తరలించింది.
పంట మంచిగా పండింది..
నాకు ఎకురంన్నర భూమి ఉన్నది. అందులో వరేసినంత కాలం అరిగోసనే ఎల్లదీసిన. ఎప్పుడు వానల కోసం ఎదిరి సూసుడె. పక్కనే వాగున్నా సుక్క నీళ్లుండయి. ఎండిపోయిన బోర్లతో ఏగలేక ఎవుసాన్ని వదిలేసిన. సెంట్రింగ్ పనిలో చేరిన. కొన్నాళ్ల పాటు పనిచేసిన. కేటీఆర్ పుణ్యమా అని కాళేశ్వర జలాలు వచ్చినయి. సిరిసిల్ల వాగంతా సముద్రమయ్యింది. నాడు కరెంటేసినా పారని బోరు, ఇప్పుడు మోటర్ చాలు చెయ్యకున్నా నీళ్లచ్చినయి. సిత్త్రమనిపించింది. నాకున్న ఎకరంన్నర అంతా పారింది. నీళ్లు బాగున్నయని యాసంగిల పక్కకే ఉన్న మరో ఎకరంన్నర కౌలుకు తీసుకున్న. పంట మంచిగా పండింది. ఇంత కాలం పండించిన వడ్లు అమ్మితే పెట్టుబడి రాలె. ఇయ్యాలే ఆరేడు బస్తాలు ఎక్కవచ్చినయి. నాకున్న బోరు 300 ఎకరాలకు పారేట్టు నీళ్లున్నయి. అందుకే మాపక్కోళ్లంతా కలిసి బోరుకు పెద్ద మోటారు పెట్టుకుందామని సిరిసిల్లకు వచ్చి పైపులు, మోటారు కొన్నం. ఎప్పుడు గిట్లనే ఉంటే మాకు మేమే రాజులం.
-సారుగు దుర్గయ్య, రైతు (తాడూరు)