వారంతా ఈటల జనసేన, ఈటల యువసేన నాయకులు
రాజకీయ పబ్బం కోసం నాటకాలు ఆడుతున్రు
టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి ఆలేటి శ్రీరాం, ప్రధాన కార్యదర్శి అజయ్
హుజూరాబాద్టౌన్, జూన్ 10 : రాజీనామా చేసేందుకు వచ్చిన తమను పోలీసులు అడ్డుకున్నారని చెబుతున్న ఈటల జనసేన, ఈటల యువసేన నాయకులు కొమ్ము అశోక్, దబ్బెట రాజుతో టీఆర్ఎస్వీకి, టీఆర్ఎస్వైకి ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి ఆలేటి శ్రీరాం, ప్రధాన కార్యదర్శి కొలిపాక అజయ్ స్పష్టం చేశారు. హుజూరాబాద్లోని టీఆర్ఎస్ కార్యాలయం వద్ద గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. ఈటల జనసేన, ఈటల యువసేన పేరుతో కార్యకలాపాలు కొనసాగించిన కొమ్ము అశోక్, దబ్బెట రాజుకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ జమ్మికుంట మార్కెట్ కమిటీలో డైరెక్టర్లుగా అవకాశం కల్పించారని అన్నారు. ఇటీవలే డైరెక్టర్ల పదవీ కాలం పూర్తవడంతో వారు కొన్నేళ్ల క్రితం పని చేసి బయటకు వెళ్లిన టీఆర్ఎస్వీ, టీఆర్ఎస్వై సంఘాలను వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
పైగా రాజీనామా చేయడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారని ఒకసారి, వంద మందికి పైగా టీఆర్ఎస్వీకి రాజీనామా చేశామని మరోసారి కల్లబొల్లి మాటలు చెబుతూ, తమకు అనువైన మీడియాతో అవాస్తవాలను ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారని దుయ్యబట్టారు. ఈటల రాజేందర్ అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి కొందరిని పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. లెఫ్ట్భావాలు, నీతి, నిజాయితీతో ఉన్న ఈటల రాజేందర్ పేదల భూములను ఎలా లాక్కున్నారో అతడి మద్దతుదారులు తెలుపాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజకీయం తెలియని మహిళలతో మీడియా ముందు మాట్లాడిస్తూ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, గంగుల కమలాకర్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్పై అర్థరహిత విమర్శలు చేయిస్తున్న ఈటల అనుచరులు ఇకనైనా తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే వారిని గ్రామాల్లో తిరగనీయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఎన్నో ప్రజాసంక్షేమ పథకాలతో గత ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపునకు కారణమైన సీఎం కేసీఆర్పై, ప్రజా సంక్షేమ పథకాలపై నేడు ఈటల రాజేందర్, అతడి అనుచరులు అనుచిత వ్యాఖ్యలు చేయడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా ఉందని టీఆర్ఎస్వై నియోజకవర్గ నాయకుడు అన్నం ప్రవీణ్ విమర్శించారు. ఈటల తన ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి స్వప్రయోజనాల కోసం బీజేపీలోకి వెళ్తున్నారని దుయ్యబట్టారు. కొందరు కిరాయి మూఖలు పార్టీతో, అనుబంధ సంఘాల పేరుతో రాజీనామా చేశామని చెప్పడం, అధికార పార్టీని వాడుకోవడం సిగ్గుచేటన్నారు. రాజీనామా చేసిన వారంతా ఈటల మోచేతినీళ్లు తాగేవారే తప్పా టీఆర్ఎస్ పార్టీకి వారితో ఎలాంటి సంబంధం లేదని ప్రవీణ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్వీ అనేది మహా సముద్రంలాంటిదని, ఎందరో వస్తారని, వెళ్తారని, అలాంటిది మొత్తం ఖాళీ అయిందని దుష్ప్రచారం చేయడంలో అర్థం లేదని చెప్పారు. సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండీ రియాజ్, టీఆర్ఎస్వీ, టీఆర్ఎస్వై నాయకులు పాకాల మధూకర్రెడ్డి, నాగరాజు, మేడిపల్లి ఓదెలు, వినయ్, శివ, రాజు, రాజేశ్, సంతోష్, రాము, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.