మెట్పల్లి రూరల్, జూన్ 10: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని స్వరాష్ట్రంలో కులవృత్తులకు పూర్వ వైభవం వచ్చిందని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మెట్పల్లి మండలం వేంపేట శివారులోని ఈత వనాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. రోజువారీ ఆదాయ, వ్యయాలను గీత కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాకముందు గ్రామాలు, కులవృత్తులు, వ్యవసాయం ఎలా ఉండేవి, కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఎలా ఉన్నాయన్న తేడాను గమనించాలని కోరారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్తోపాటు పలు సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతున్నాయని పేర్కొన్నారు. సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. గత పాలకులు గీత కార్మికుల కోసం వెయ్యి చెట్లు పెట్టలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ హరితహారంలో భాగంగా గీత కార్మికుల కోసం ఈత, తాటి చెట్లు నాటిస్తూ వారి ఉపాధిని మెరుగుపర్చారన్నారు. ప్రత్యేక తెలంగాణలో చెట్టు పన్ను రద్దు చేయడంతోపాటు గీత కార్మికుల రుణ బకాయిలను సైతం మాఫీ చేశామని గుర్తు చేశారు. త్వరలోనే గీత కార్మికుల ఎక్స్గ్రేషియాకు 10కోట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇక్కడ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణ, ఎక్సైజ్ డీసీ శాస్త్రి, ఉమ్మడి జిల్లా డీపీఈవో శ్రీధర్, జిల్లా డీపీఈవో చంద్రశేఖర్, మండల గీత కార్మిక సంఘం అధ్యక్షుడు, వేంపేట ఎంపీటీసీ పుల్ల చంద్రశేఖర్గౌడ్, మెట్పల్లి ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.