వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన
లక్షణాలు ఉన్న వారికి మందులు
మంథని టౌన్, మే 10: కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మంథనిలో ఇంటింటా జ్వర సర్వే కొనసాగుతున్నది. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ఈ సర్వే కార్యక్రమాన్ని మంథని మున్సిపల్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మెప్మా ఆర్పీలు నిర్వహిస్తున్నారు. 5వ రోజైన సోమవారం మంథనిలోని 13 వార్డుల్లో సర్వే కార్యక్రమాన్ని అధికారులు, సిబ్బంది చేపట్టారు. అన్ని వార్డుల్లో 5,754 ఇండ్లకుగానూ 3,420 గృహాల్లో సర్వే ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సర్వే ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ జే శ్రీనివాస్రెడ్డి పర్యవేక్షించడంతో పాటు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. 1 నుంచి 4 వార్డుల్లో నిర్వహించే సర్వేకు జూనియర్ అసిస్టెంట్ నారాయణ, 5 నుంచి 8వ వార్డులో నిర్వహించే సర్వేకు బిల్ కలెక్టర్ బండారి రాజు, 9 నుంచి 13వ వార్డుల్లో నిర్వహించే సర్వేకు ఎలక్ట్రిషియన్ జీ కిషన్ సూపర్వైజర్లుగా వ్యవహరించగా, వార్డు లెవల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, మెప్మా ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లతో సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లోనే ప్రతి ఇంటికి వెళ్తూ వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, బీపీలతో పాటు ఇతర వ్యాధుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే వైరస్కు గురైన వారితోపాటు లక్షణాలు ఉన్న వారి వివరాలను సేకరించారు. మందులు పంపిణీ చేశారు.
కాల్వశ్రీరాంపూర్, మే10: మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటా జ్వర సర్వే కొనసాగుతున్నది. జ్వరం, దగ్గు, జలుబు తదితర లక్షణాలు ఉంటే వారికి అక్కడే వైద్య సిబ్బంది అవగాహన కల్పించి మందులు పంపిణీ చేస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు హోం ఐసొలేషన్ లో ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సర్వేను ఎంపీడీవో కిషన్, తహసీల్దార్ సునీత, ఎంపీవో గోవర్ధన్ పరిశీలించి, సర్వే టీంకు పలు సూచనలు చేశారు.
కోల్సిటీ, మే 10: రామగుండం 48వ డివిజన్లో ఇంటింటా జ్వర సర్వే చేపట్టారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఇంటింటా జ్వర సర్వేను కార్పొరేటర్ పొన్నం విద్య పర్యవేక్షించారు. డివిజన్ ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆశ వర్కర్లు సరస్వతి, అంగన్వాడీ టీచ ర్ శారద, ఆర్పీలు సుమలత, లలిత ఉన్నారు.
పెద్దపల్లి జంక్షన్, మే10: పట్టణంలో జ్వర సర్వే కొనసాగుతున్నది. సర్వేలో భాగంగా 5,917 మం ది ఆరోగ్య వివరాలను సేకరించారు. 37 మందికి జ్వర లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని మున్సిపల్ కమిషనర్ సీహెచ్ తిరుపతి తెలిపారు.