పల్లె ప్రగతి’తో అభివృద్ధి పనులు
పారిశుధ్యానికి పెద్దపీట
ఆహ్లాదానికి కేరాఫ్ ప్రకృతి వనం
ప్రభుత్వ లక్ష్యాలు చేరుకున్న పంచాయతీ
సుజాతనగర్, మే 10 :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. కనీస సౌకర్యాలు లేక అల్లాడిన పల్లెలు నేడు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. ఏ గ్రామానికెళ్లినా పచ్చందాలు స్వాగతం పలుకుతున్నాయి. వైకుంఠధామాలతో ఆఖరి మజిలీ కష్టాలు తీరాయి. ఎవెన్యూ ప్లాంటేషన్, నర్సరీ, పల్లె ప్రకృతి వనాలు గ్రామాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సుజాతనగర్ మండలం రాఘవాపురం గ్రామంలో ‘పల్లె ప్రగతి’ తీసుకొచ్చిన మార్పు, అభివృద్ధి తీరుపై ‘నమస్తే తెలంగాణ’ కథనం.
పల్లె ప్రగతి గ్రామాల రూపురేఖలను మారుస్తున్నది.. పల్లెలకు పచ్చందాలు తీసుకువస్తున్నది.. ఎవెన్యూ ప్లాంటేషన్, నర్సరీ, పల్లె ప్రకృతి వనాలు గ్రామాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో అన్ని వసతులతో వైకుంఠధామాలు అందుబాటులోకి వస్తున్నాయి.. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీలు సమకూరస్తుండడంతో పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉంటున్నది.. ఇలా సుజాతనగర్ మండలంలోని రాఘవాపురమూ అన్నివిధాలుగా అభివృద్ధి చెందింది.. ఈ గ్రామాభివృద్ధిపై ప్రత్యేక కథనం.
అందుబాటులోకి వైకుంఠధామం..
పల్లెప్రగతి పనుల్లో భాగంగా గ్రామంలో రూ.12.60 లక్షలతో వైకుంఠధామం అందుబాటులోకి వచ్చింది. మృతదేహాలను దహనం చేసేందుకు రెండు ప్లాట్ఫాంలు ఏర్పాటయ్యాయి. మహిళలు, పురుషులకు వేర్వేరుగా స్నానాల గదులు, అన్ని వసతులతో షెడ్లు వచ్చాయి. దహన సంస్కారాల కోసం వచ్చే వారికి నీటి కొరత లేకుండా ఏర్పాట్లు ఉన్నాయి.
మొక్కలతో కళకళ..
గ్రామ జనాభా 1,352 కాగా ఇక్కడ 373 కుటుంబాలు నివసిస్తున్నాయి. పంచాయతీ పాలకవర్గం హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామంలోని ప్రతి ఖాళీ స్థలంలో మొక్కలు నాటించింది. పల్లె ప్రకృతి వనం ఏర్పాటుతో గ్రామానికే కొత్త కళ వచ్చింది. ప్రభుత్వం వనం నిర్మాణానికి రూ.12 లక్షలు కేటాయించింది. గ్రామంలో నాటిన మొక్కలు ఇప్పుడు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రస్తుతం గ్రామం పరిధిలో 10 వేల మొక్కలు పెరుగుతున్నాయి.
ఇంటింటికీ వెళ్తూ చెత్త సేకరణ..
గ్రామంలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా పాలకవర్గం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. రూ.1.50 లక్షల నిధులతో డంపింగ్ యార్డు పూర్తయింది. పంచాయతీకి ట్రాక్టర్ సమకూరడంతో పారిశుధ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చెత్తాచెదారాన్ని సేకరిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ ఎరువులు తయారు చేస్తున్నారు.
స్వచ్ఛ గ్రామం దిశగా..
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మా గ్రామం స్వచ్ఛంగా మారింది. రెండు విడతలుగా చేపట్టిన కార్యక్రమంతో గ్రామాన్ని ప్రగతి బాట పట్టించాం. పారిశుధ్యంపై దృష్టి సారించాం. గ్రామస్తులూ పరిసరాల శుభ్రతకు సహకరిస్తున్నారు. పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలకు ప్రతిరోజూ నీరందిస్తున్నాం..
-గరికె వెంకటసాంబయ్య, సర్పంచ్, రాఘవాపురం