పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే సర్కారు లక్ష్యం
ఆర్థిక భారం పడకూడదనే టీ-హబ్ సెంటర్లు
మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్లో టీ-హబ్ సెంటర్ ప్రారంభం
విద్యానగర్, జూన్ 9 : ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, వారిపై ఆర్థిక భారం పడకూడదనే టీ-హబ్ సెంటర్లను ఏర్పాటు చేసిందని చెప్పారు. బుధవారం కరీంనగర్లోని ప్రభుత్వ దవాఖానలో తెలంగాణ రోగ నిర్ధారణ కేంద్రం (టీ-హబ్)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ పేదలకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేసి, లక్షణాలను కనుగొని పూర్తిస్థాయిలో వైద్యం అందించేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటివి లేవన్నారు. ఇందులో 57 రకాల రక్త పరీక్షలను ఉచితంగా చేస్తున్నారని, వీటి విలువ ప్రైవేట్ దవాఖానాల్లో అయితే రూ.10వేల వరకు ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా మూడు రూట్ మ్యాప్లను ఏర్పాటు చేశామని, ఇందులో గంగాధర, జమ్మికుంట, హుజూరాబాద్ ఉన్నాయని తెలిపారు.
ప్రతిరోజూ అక్కడి నుంచి శాంపిళ్లను కలెక్ట్ చేసి టీ- హబ్కు తరలించి అదేరోజు పరీక్షా ఫలితాలను ఇస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పీహెచ్సీతోపాటు సబ్ సెంటర్లు, సీహెచ్సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది శాంపిళ్లను సేకరిస్తారని, ఎలాంటి వ్యాధి అనుమానిత లక్షణాలున్నా రక్త నమూనాలు ఇవ్వాలన్నారు. పూర్తిస్థాయిలో పరీక్షలు చేసి మందులను వైద్యులు అందజేస్తారని చెప్పారు. రూ.2 కోట్లతో నిర్మించిన టీ-హబ్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీ-హబ్ నిర్వహణ కోసం ప్రతినెలా రూ.15 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. అనంతరం గంగుల కమలాకర్ హిమోగ్లోబిన్ పరీక్ష చేసుకున్నారు. మంగళ, బుధవారాల్లో ఒకే ఫలితం రావడంతో ఫలితాలు నాణ్యతగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ వై సునీల్రావు, కలెక్టర్ శశాంక, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జువేరియా, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, ఆర్ఎంవో డాక్టర్ శౌరయ్య, వైద్యులు శ్రీనివాస్, పద్మ, నవీన, వసీం, రవీందర్రెడ్డి, సమీర్, సుధాకర్రెడ్డి, నోడల్ ఆఫీసర్ మనోజ్కుమార్, నాయకులు చల్ల హరిశంకర్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.