సిరిసిల్ల, మే 9: ఈజీఎస్ పనులు పారదర్శకంగా ఉండేందుకు అధికారులు పలు రకాల చర్యలు చేపట్టారు. అక్రమాలను నిరోధించడానికి పనులు జరిగే చోట ఫొటోలను తీసి వర్క్ ఫైల్లో జత చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పని జరిగే ప్రదేశంలో పనికి ముందు, పని జరుగుతున్నప్పుడు, పూర్తయిన తర్వాత మూడు రకాల ఫొటోలను తీసి వర్క్ఫైల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహించిన టెక్నికల్ అసిస్టెంట్లకు వేతనాల్లో కోత విధించనున్నారు.
అక్రమాలకు కట్టడి
ఈజీఎస్ పనులు పారదర్శకంగా ఉండేందుకు అధికారులు నడుం బిగించారు. ఆయా మండలాల పరిధిలోని టెక్నికల్ అసిస్టెంట్లు తప్పనిసరిగా ఫొటోలు తీసుకోవాలి. గ్రామాల్లో కూలీలు ఎక్కడ పని చేస్తున్నారు.. పని ప్రదేశంలో పని ప్రారంభానికి ముందు, పని చేస్తున్నప్నుడు, పూర్తయ్యాక ప్రదేశాల ఫొటోలను వర్క్ఫైల్లో జతచేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో ప్రతి పనిని మదింపు చేయడంతోపాటు ఏ తేడా వచ్చిన వెంటనే గుర్తించే అవకాశం ఉన్నది. ఇలా అక్రమాలను ప్రాథమిక దశలోనే కట్టడి చేసే అవకాశం ఉన్నది.
సామాజిక తనిఖీకి దోహదం..
టెక్నికల్ అసిస్టెంట్లు పనులు జరిగే చోట ఫొటోలు తీసి వాటిని భద్రపర్చుకోవాలి. పని ప్రదేశంలో తీసిన ఫొటోలు ఏడాదికోసారి నిర్వహించే సామాజిక తనిఖీకి దోహదం చేస్తాయి. సామాజిక తనిఖీ తర్వాత తనిఖీ బృందాలు అడిట్ నిర్వహించే సమయంలో ఇబ్బందులు ఉండకుండా ఫొటోలు తీయిస్తున్నారు. పనులు జరిగిన చోట వర్షాలు పడడం, రైతులు భూమిని సాగు చేయడం, చదును చేయడంతో ఆధారాలు లభించడం లేదు. అడిట్ బృందాలు అభ్యంతరం తెలుపడంతో ఈ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. పనికి సంబంధించిన ఫొటోలను సాక్ష్యాలుగా వర్క్ఫైల్లో పొందుపరుస్తారు. జిల్లాలో దాదాపుగా 95,268 జాబ్కార్డులు ఉండగా 5,769 శ్రమశక్తి సంఘాల్లో 1,16,070 మంది కూలీలు పని చేస్తున్నారు.
పని వేళల్లో మార్పు
ఎండలు ముదిరిపోవడంతో కూలీల పని వేళలను అధికారులు మార్చారు. కూలీలకు వడదెబ్బ ముప్పు పొంచి ఉండడంతో ఉదయం 7 నుంచి 11గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6గంటల వరకు పని వేళలను మార్చారు.