గోదావరిఖని, మే 9: మూడెకరాల భూ కబ్జా చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్పై ఒక దినపత్రికలో వచ్చిన కథనంలో ఏమాత్రం నిజం లేదని జనగామ గ్రామస్తులు స్పష్టం చేశారు. ఆదివారం గ్రామంలోని కచ్చీడు వద్ద గ్రామానికి చెందిన కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్, జనగామ కవిత విలేకరులతో మాట్లాడారు. మంత్రి కొప్పుల బినామీల పేర్లతో భూమి కబ్జా చేసుకున్నారని, మున్సిపల్ అధికారులతో మాట్లాడి తన భూమి దాకా రోడ్డు వేయించుకున్నారని జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదేనని కొట్టిపారేశారు. రాజీవ్ రహదారి నుంచి జనగామకు రోడ్డు వేయాలని గ్రామస్తులమంతా ఎన్నోయేళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని, కానీ అప్పుడు ఎవరూ చేయని పనిని ఎమ్మెల్యే చందర్ వచ్చాక రోడ్డును మంజూరు చేశారని తెలిపారు. తమ గ్రామ అవసరాల కోస మే రోడ్డు నిర్మాణం జరిగిందన్నారు. రోడ్డు నిర్మాణంలో మిగతా 30 మీటర్ల ఒడ్డు ఇవ్వాలని రామ న్న అనే పట్టాదారుడితో గ్రామ పెద్దలు మాట్లాడారనీ, అందుకు అతను కూడా సానుకూలంగా ఉన్నాడనీ, ఇప్పుడు వేసిన రోడ్డుకు మంత్రికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ రోడ్డుకు అవతలి పక్కన సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వన దేవతలను గ్రామంలో నుంచి తీసుకువెళ్లేందుకు తమకు రోడ్డు అవసరమని భావించే నిర్మించుకున్నామని చెప్పారు. మంత్రిపై అభియోగం చేస్తున్న అందుగుల శ్రీను అనే వ్యక్తి భూమిని కొంత అమ్ముకోగా, కొంత రాజీవ్ రహదారి కింద పోయిందన్నారు. శ్రీను అనే వ్యక్తికి అక్కడ భూమి లేదనీ, అతను చేస్తున్న అభియోగంలో నిజం లేదన్నారు. భూమిని బినామీల పేరుతో మంత్రి కబ్జా చేశారన్న ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ జనగామ పెద్దలు రుద్రభట్ల వామన్ రావు, తోకల రమేశ్, మల్లేశం, హన్మంత రావు, అర్కుటి శంకర్, మల్లయ్య, పైడిపల్లి శ్రీనివాస్, కలవేన రవీందర్, ముత్యాల రమేశ్, రాపెల్లి అంజయ్య, బండారి రవీందర్, ఊదం రవి, పుట్ట శరత్, అర్కుటి గట్టయ్య, రాయమల్లు, గోలివాడ రాజబాబు, అంజయ్య, నరేందర్ రావు, భూమయ్య, భీమసాగర్తోపాటు గ్రామస్తులు ఉన్నారు.