3.61 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరణ..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటిస్థానం
పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్
మంథని టౌన్, జూన్ 8: యాసంగి ధాన్యం కొనుగోళ్లలో మంథని సహకార సంఘం అద్భుతమైన రికార్డు సృష్టించిందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యధికంగా 32 ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించి 3,61,783 క్వింటాళ్ల ధాన్యం సేకరించినట్లు పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ వెల్లడించారు. స్థానిక సహకార సంఘం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక వ్యవసామ సహకార సంఘం మంథని పరిధిలో 32 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 4058 మంది రైతుల నుంచి 3,61,783 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి, రూ. 68,30,46,681 వ్యాపారం చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు రూ.52,47,29,596 నగదు రైతులకు చెల్లించామని వెల్లడించారు. మిగతా ధాన్యం డబ్బుల చెల్లింపు వివిధ దశల్లో ఉందని, త్వరలోనే వాటి చెల్లింపులు సైతం పూర్తవుతుందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఇప్పటి వరకు మంథని సహకార సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. గ్రామగ్రామాన ధాన్యం కొనుగోళ్లు మంజూరు చేయించి ప్రశాంతంగా కొనుగోళ్లు జరిపేందుకు పూర్తి స్థాయిలో సహకరించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, జిల్లా సహకార శాఖాధికారి మైకెల్ జోస్, ఉన్నతాధికారులు, సహకార, రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, సహకార సంఘం పాలకవర్గం, రైతులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. అదే విధంగా అహర్నిశలు శ్రమించి కొనుగోళ్లు పూర్తి చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల సూపర్ వైజర్లు, సెంటర్ ఇన్చార్జిలు, ట్యాబ్ ఆపరేటర్లు, సంఘం సిబ్బంది, హమాలీలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాశ్రెడ్డి, డైరెక్టర్లు మాచిడి రాజుగౌడ్, ఆకుల రాజబాపు, పెద్దిరాజు ప్రభాకర్, రావికంటి సతీశ్కుమార్, సిరిమూర్తి ఓదెలు, గడ్డం పోచం, లెక్కల కిషన్రెడ్డి, కొత్త శ్రీనివాస్, దాసరి లక్ష్మి-మొండయ్య, ఉడుత మాధవి-పర్వతాల్యాదవ్, దేవళ్ల విజయ్కుమార్, సీఈవో మామిడాల అశోక్కుమార్తోపాటు తదితరులు పాల్గొన్నారు.