ఇల్లెందు, జూన్ 8: కరోనా బాధితులు భయపడొద్దంటూ ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ ధైర్యం చెప్పారు. ప్రజల ఆరోగ్యం తప్ప తమకు మరేమీ ముఖ్యం కాదన్నారు. బయ్యారం మండలంలోని ఇర్సులాపురం, రామచంద్రాపురం, జగత్రావుపేట, కంబాలపల్లి, కోయగూడెం, కొత్తగూడెం గ్రామ పంచాయతీల్లో మంగళవారం ఆమె పర్యటించారు. కరోనా బాధితులను పరామర్శించారు. వారికి కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైరస్ బాధితులకు తాను అండగా ఉన్నానని, ఏదైనా సమస్య ఉంటే తనను సంప్రదిస్తే పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. మండలాల్లో ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, చికిత్సతోపాటు రెండు పూటల పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఇల్లెందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరిసింగ్నాయక్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.