సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప
ఆదర్శనగర్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణానికి భూమి పూజ
కాగజ్నగర్ టౌన్, జూన్ 7 : కాగజ్నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్పష్టం చేశారు. స్థానిక ఆదర్శనగర్లో ఇంటిగ్రేటెడ్ మార్కె ట్ భవన నిర్మాణానికి కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్తో కలిసి ఆయన భూమి పూజ చేశారు. జనాభా ప్రాతిపదికన ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు రెండెకరాల్లో రూ.7కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిధులు కేటాయించారన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి, పనులను ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్ మాట్లాడుతూ.. పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, నూతన మార్కెట్ నిర్మాణంతో ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ గిరీశ్కుమార్, తహసీల్దార్ ప్రమోద్కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు వనమాల విజయ రాము, వలీ, శివప్రసాద్, ఎల్లేశ్, విజయ్యాదవ్, పంబాల సుజాత, మినాజ్, సునీల్, కో ఆప్షన్ మెంబర్లు స్రవంతబాయి, దేవయ్య, జిల్లా కో ఆప్షన్ మెంబర్ సిద్ధిఖ్, టీఆర్ఎస్ నాయకులు కీర్తి శ్రీనివాస్, మహబూబ్ పాల్గొన్నారు.
ప్రవేశాల బ్యానర్ ఆవిష్కరణ..
ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ గురుకులంలో 2021-22 విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వెంకటయ్య తెలిపారు. ప్రవేశాల బ్యానర్ను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆవిష్కరించారు. అంతకు ముందు 6వ తరగతిలో ప్రవేశాల కోసం సిబ్బందితో కలిసి ప్రిన్సిపాల్ గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపట్టారు.