ఎర్రుపాలెం, జూన్ 7: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. ఎర్రుపాలెం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ దేవరకొండ శిరీష అధ్యక్షతన కొవిడ్పై వైద్య, పంచాయతీరాజ్, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాలను కరోనా బాధితులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంకా అవసరమైన గ్రామాల్లో అధికారులు ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, బాధితులు కరోనా నుంచి త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జడ్పీటీసీ శీలం కవిత, మధిర ఏఎంసీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఎంపీడీవో రామకృష్ణ, ఎస్సై ఉదయ్కిరణ్, డాక్టర్ సుధాకర్నాయక్, ఇన్చార్జి తహసీల్దార్ రాజేశ్, ఎంపీవో శ్రీలక్ష్మి, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ మొగిలి అప్పారావు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.