కొవిడ్ సెకండ్వేవ్లో సర్కార్ డాక్టర్ల ఉత్తమ వైద్యం
సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృష్టి
పెద్దపల్లి జంక్షన్, మే 7: కరోనా కష్టకాలంలోనూ సర్కార్ వైద్యులు, సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తున్నారు. సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గర్భిణులను ఉచితంగా దవాఖానకు తీసుకువచ్చి, మళ్లీ క్షేమంగా ఇంటికి పంపిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రసవాలు చేస్తుండడంతో ప్రభుత్వ దవాఖానలకు వచ్చే గర్భిణులకు మొదటి నుంచి సహజ కాన్పుపై అవగాహన కల్పిస్తున్నారు. నెల నెల వారిని ఇంటి వద్ద నుంచి 102 వాహనంలో తీసుకువచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి సురక్షితంగా ఇంటికి చేరుస్తున్నారు. సుఖ ప్రసవాలకు ఆహార నియమాలు, చిన్న పాటి వ్యా యామాలపై వివరిస్తున్నారు. మొదటి కాన్పు సాధారణ ప్రసవం అయ్యేందుకు కృషి చేస్తున్నారు. అవసరమైతేనే ఆపరేషన్(సిజేరియన్) చేస్తున్నారు. 2021 జనవరి నుంచి ఇప్పటి దాకా ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు 430, సిజేరియన్ 759 చేశారు.
ఉచిత వైద్యం..
ప్రభుత్వ దవాఖానలో బాలింతలకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడంతో పాటు వారికి పౌష్టికాహారం అందిస్తున్నారు. వేలాది రూపాయలు విలువ చేసే వ్యాక్సిన్లు కూడా ఉచితంగా వేస్తున్నారు. ప్రభుత్వం దవాఖానాలో ప్రసవమైన వారికి కేసీఆర్ కిట్ అందిసున్నారు. దీంతో దాదాపు రూ.50వేల వరకు ఆదా అవుతున్నాయని గర్భిణులు చెబుతున్నారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉంటున్నారు.