సిద్ధమవుతున్న సింగరేణి ఆక్సిజన్ ప్లాంట్
వేగంగా నిర్మాణ పనులు
పరిశీలించిన ఆర్జీ-1 జీఎం
సింగరేణిలోని అన్ని దవాఖానలకు ఇక్కడి నుంచే సరఫరా
గోదావరిఖని, మే 7: సింగరేణి ఆర్జీ-1 పరిధిలో గోదావరిఖని నుంచి ముస్త్యాల వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ త్వరలో అందుబాటులోకి రానున్నది. పనులు వేగంగా జరుగుతుండగా, శుక్రవారం ఆర్జీ-1 జీఎం కే నారాయణ పరిశీలించారు. సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్ ఆదేశానుసారం కొవిడ్-19 సెకండ్ వేవ్ తీవ్రత దృష్ట్యా ఆర్జీ-1 ఏరియాలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా జీఎం ఆక్సిజన్ తయారీ, సిలిండర్లోకి ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసే విధానాన్ని పరిశీలించారు. ప్లాంట్ను ఏ విధంగా నిర్మించాలో ముందస్తు పనుల కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కొవిడ్-19 సెకండ్ వేవ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని సింగరేణిలో ఉన్న అన్ని దవాఖానలకు ఆక్సిజన్ను అందుబాటులో తీసుకురానున్నట్లు చెప్పారు. త్వరలో ఈ ప్లాంట్ వినియోగంలోకి వస్తుందన్నారు. జీఎం వెంట ఏరియా ఇంజినీర్ రామ్మూర్తి, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, సివిల్ సూపర్వైజర్ యుగేంధర్ ఉన్నారు.