ఎదులాపురం,మే7: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సర్వే చేయాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో పీహెచ్సీ, మెడికల్ ఆఫీసర్లతో శుక్రవారం సమావేశమై మాట్లాడారు. 45ఏళ్లు పైబడిన వారు టీకా వేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఇంటింటికీ వెళ్లి కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి కిట్ ఇవ్వాలని సూచించారు. పీహెచ్సీల్లో వ్యాక్సినేషన్ శాతం తగ్గకుండా చూసుకోవాలన్నారు.వ్యాక్సినేషన్ తగ్గితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది బృందం తమకు కేటాయించిన పరిధిలో సర్వే చేయాలన్నారు. కొవిడ్ కాల్ సెంటర్ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని చెప్పారు. కాల్ సెంటర్ నంబర్ 7382726029కు ఫోన్ చేసిన వారికి అన్ని సలహాలు, సూచనలు, ఇంటికి వచ్చి కొవిడ్ కిట్ అందిస్తామని తెలిపారు. వ్యాక్సినేషన్, కొవిడ్ కిట్, కొవిడ్ నిర్ధారణ పరీక్షలో నిర్లక్ష్యం చూపిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్వో వైసీ శ్రీనివాస్, డీఐవో, అడిషనల్ డీఎంహెచ్వో శ్రీకాంత్, మలేరియా అధికారి శ్రీధర్, వివిధ మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
పకడ్బందీగా నిర్వహించాలి
గుడిహత్నూర్,మే7: కరోనా కట్టడికి చేపట్టిన ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ ఇన్చార్జి కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మండల కేంద్రంలోని జవహర్నగర్ కాలనీలో వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను శుక్రవారం పరిశీలించారు. కుటుంబంలోని అందరి ఆరోగ్య సమాచారం సేకరించాలన్నారు. జ్వరం, ఇతర జబ్బులతో బాధ పడుతున్న వారిని గుర్తించి వైద్యం అందించాలన్నారు. అవసరమున్న వారికి వెంటనే కొవిడ్ కిట్లు, మందులు అందజేయాలని సూచించారు. 45 ఏళ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ వేసుకునే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, మండల వైద్యాధికారి శ్రీనివాస్, తహసీల్దార్ పవన్చంద్ర, వైద్య సిబ్బంది ఉన్నారు.