కేఎంసీలో టీఆర్ఎస్ది అద్భుత విజయం
మంత్రి పువ్వాడ అభివృద్ధి ఫలితమే ఈ విక్టరీ
టీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశంలో మంత్రి వేముల
ఖమ్మం మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఆర్ఎస్ కోసం అహర్నిశలూ పనిచేసే కార్యకర్తలను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటారని, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏ రూపంలోనైనా రాజకీయ అవకాశం రావొచ్చని, పార్టీ కోసం విధేయులుగా పని చేయడమే తమ విధిగా భావించాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేఎంసీకి నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ కార్పొరేటర్లతో ఖమ్మం నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల విషయంలో అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని వారికి వివరించారు. ఖమ్మం నగర కార్పొరేషన్ సాధించిన విజయం రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిందని అన్నారు. ఖమ్మం గులాబీ గుమ్మం అయిందని, ప్రజలు పార్టీపై విశ్వాసం ఉంచారని అన్నారు. మంత్రి అజయ్ చేసిన అభివృద్ధికి ఇచ్చిన అద్భుతమైన తీర్పు అని ఆయన అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రగామిగా ఉందన్నారు. కేఎంసీ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు ఇందుకు నిదర్శనమన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల విషయమై మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో సీఎం కేసీఆర్ సంప్రదించి సామాజిక సమతుల్యత ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అధినేత నిర్ణయం మనందరికీ శిరోధార్యమని అన్నారు. అధిష్ఠానం సీల్డ్ కవర్ ద్వారా పంపించిన మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల అభ్యర్థుల పేర్లను ఆయన కార్పొరేటర్ల సమావేశంలో చదివి వినిపించారు. దీంతో కార్పొరేటర్లు హర్షధ్వానాలు చేస్తూ తమ ఆమోదాన్ని తెలియజేశారు. మేయర్ అభ్యర్థిగా పునుకోల్లు నీరజను ప్రతిపాదించాల్సిన, బలపర్చాల్సిన కార్పొరేటర్ల పేర్లను కూడా సమావేశంలో నిర్ణయించారు.
అలాగే డిప్యూటీ మేయర్ పదవికి ఫాతిమా జోహారా పేరును ప్రతిపాదించాల్సిన, బలపర్చాల్సిన కార్పొరేటర్ల పేర్లను సైతం నిర్ణయించారు. అనంతరం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ టీఆర్ఎస్ తరఫున గెలుపొందిన కార్పొరేటర్లు ప్రజా సేవలో నిమగ్నమై ప్రభుత్వానికి, ఖమ్మం నగరానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మేయర్, డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లందరినీ కలుపుకొనిపోవాలని, తద్వారా పార్టీ పటిష్టతకు సమైక్యంగా కృషి చేయాలని సూచించారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్పొరేటర్లకు భవిష్యత్తులో మరిన్ని రాజకీయ అవకాశాలు వస్తాయని, ఎవరూ నిరాశ చెందొద్దని అన్నారు. పార్టీ కోసం పని చేసే వారిని అధినేత కేసీఆర్ ఎప్పుడూ దృష్టిలో ఉంచుకుంటారన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు తదితరులు పాల్గొన్నారు.