19,861 ఇళ్లను సందర్శించిన 530 బృందాల సభ్యులు
412 మంది జ్వర పీడితుల గుర్తింపు, 365 కిట్ల అందజేత
ఖమ్మం సిటీ/ రఘునాథపాలెం, మే 7: కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం జిల్లాలో ఇంటింటి జ్వర పీడితుల గుర్తింపు సర్వే షురూ అయింది. వైరస్ బాధితులను గుర్తించి వారికి ఇంటి వద్దనే మందులు అందించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. జిల్లాలో 4 అర్బన్ హెల్త్ సెంటర్లు, 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సర్వే జరగాల్సి ఉంది. తాజాగా అందిన సమాచారం మేరకు శుక్రవారం 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 530 బృందాలు ఇంటింటి సర్వేలో పాల్గొన్నాయి. ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, పంచాయతీ కార్యదర్శులు, ఎస్హెచ్జీల సమన్వయకర్తలు కలిసి మొత్తం 19,861 ఇళ్లను సందర్శించారు. గ్రామ పంచాయతీలు సమకూర్చిన ఆక్సిజన్, పల్స్ రేటు నమోదు చేసే మిషన్ల ఆధారంగా పరీక్షలు నిర్వహిస్తూ వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా ఒక్కరోజు 412 మంది జ్వర పీడితులను గుర్తించారు. వారిలో 365 మందికి కరోనా మందుల కిట్లను ఇంటి వద్దనే అందించి తగు సలహాలు, సూచనలు అందించారు. కనీసం వారం రోజులపాటు మందులు వాడాలని, అప్పటికీ జ్వరం లేదా దగ్గు, ఆయాసం తగ్గనట్లయితే మెరుగైన వైద్యం కోసం తమకు సమాచారం ఇవ్వాలని బాధితులకు అవగాహన కల్పించారు.
జ్వరం ఉంటే మెడికల్ కిట్లు
మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది శుక్రవారం క్షేత్రస్థాయిలో సర్వేను చేపట్టారు. ప్రతి ఇంటినీ సందర్శించి వారి ఆరోగ్య విషయాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఎలాంటి అనుమానం ఉన్నా అప్పటికప్పుడే వారికి మెడికల్ కిట్లు అందజేస్తున్నారు. అంతేకాదు ప్రత్యేక అవగాహన ద్వారా అనుక్షణం మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. రఘునాథపాలెం మండలంలో ఇంటింటా ఫీవర్ సర్వే ప్రారంభమైంది. మంచుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు గ్రామాల్లో ప్రతి గడపనూ తాకుతూ ఫీవర్ పరీక్ష చేస్తున్నారు. ఏ చిన్నపాటి దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నా వెంటనే వారి పేర్లను నమోదు చేసుకొని కావాల్సిన మందులను పంపిణీ చేస్తున్నారు. అవసరమనుకుంటే 108కు ఫోన్ చేస్తే ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు.