రామగుండం సీపీ సత్యనారాయణ
పెళ్లిళ్లు, ఇతర విందుల్లో నిబంధనలు పాటించని 59 మందిపై కేసు
ఫర్టిలైజర్సిటీ, జూన్ 6: పెళ్లిళ్ల నిర్వాహకులు కొవిడ్ నిబంధనలు పాటించాలని, లేకపోతే చట్టప్రకారం చర్యలు తప్పవని రామగుండం సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు పెళ్లిళ్లు, ఇతరత్రా శుభకార్యాల సమయంలో కొవిడ్ నిబంధనలు పాటించని 59 మంది (పెద్దపల్లి జిల్లాలో 36 మంది, మంచిర్యాల జిల్లాలో 23)పై కేసు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. పెళ్లి వేడుకల్లో వధూవరులతో సహా మొత్తం 40 మందికి మించరాదన్నారు. పెళ్లికి వచ్చేవారి వివరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. జ్వరం, దగ్గు, లాంటి కరోనా లక్షణాలు ఉన్నవారు వేడుకలకు హాజరు కావద్దని, అలాగే ఫొటోల కోసం మాస్కులు తీయకూడదని సూచించారు.
ఖనిలో ఐదు పెళ్లిళ్ల పెద్దలపై కేసు
శుభకార్యాల సమయంలో కొవిడ్ నిబంధనలు పాటించని ఐదుగురు పెళ్లి పెద్దలపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు సీఐ రమేశ్బాబు తెలిపారు. గోదావరిఖనిలోని కళ్యాణ్నగర్, గణేశ్నగర్, చంద్రబాబు కాలనీ, పరశురాంనగర్, ఎల్బీ నగర్లో జరిగిన ఐదు పెళ్లిళ్లలో ఏ ఒక్కరూ నిబంధనలు పాటించకపోవడంతో సీపీ ఆదేశాల మేరకు ఎస్ఐలు ప్రవీణ్కుమార్, రమేశ్ వేడుకల నిర్వాహకులైన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
బట్టుపల్లిలో నలుగురిపై..
మంథని రూరల్, జూన్ 6: మండలంలోని బట్టుపల్లి గ్రామంలో కొవిడ్ నిబంధనలు పాటించకుండా జరుగుతున్న పెళ్లిలో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో ఆదివారం అనుమతులు లేకుండా, కరోనా నిబంధనలు పాటించకుండా వివాహ వేడుకలు జరుపుకొంటున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు జరిపారు. పెళ్లి వేడుక వద్ద పరిమితికి మించి ప్రజలు గుమిగూడి ఉండడాన్ని గుర్తించి, వారిని ఇండ్లకు పంపించారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పెళ్లి పెద్దలు పుప్పాల బాపు, భూదక్క, బోయిని కుమార్, దేవికకు కౌన్సెలింగ్ ఇచ్చి, వారిపై కేసు నమోదు చేశామని మంథని ఎస్ఐ చంద్రకుమార్ తెలిపారు. పెళ్లి వేడుకలకు సంబంధించి నిర్వాహకులు ముందస్తుగా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, లేకపోతే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ప్రొహిబిషన్ ఎస్ఐ అజయ్, సిబ్బంది ఉన్నారు.