రాష్ట్ర ఆయిల్పామ్ ఫెడరేషన్ ఫీల్డ్ ఆఫీసర్ చంద్రశేఖర్
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు5: ఆయిల్పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని తెలంగాణ రాష్ట్ర ఆయిల్పామ్ పెడరేషన్ ఫీల్డ్ ఆఫీసర్ ఏ.చంద్రశేఖర్ అన్నారు. గురువారం మండలంలోని తాటికొండ గ్రామానికి చెందిన రాపోలు శేషారెడ్డి 11 ఎకరాల వ్యవసాయ భూమిలో 627 ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన తాటికొండలో మాట్లాడారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం మొక్కలకు 85 శాతం, పంట యాజమాన్యానికి ఏడాదికి రూ.5 వేలు, అంతర పంటల సాగుకు హెక్టారుకు రూ.ఐదు వేలు ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ ద్వారా అందిస్తుందని అన్నారు. ఆయిల్పామ్ సాగులో తక్కువ పెట్టుబడి , అధిక లాభాలు ఉంటాయన్నారు. ఈ మొక్కలు నాటిన నాలుగేళ్ల తరువాత కాత చేతికి వస్తుందని, ఇలా 30 ఏళ్ల వరకు పంట చేతికి వస్తుందని అన్నారు. మెట్రిక్ టన్నుకు రూ.17వేలకు పైగా ధర ఉందని, దీని సాగుకు ప్రభుత్వం రూ.36వేల సబ్సిడీ ఇస్తుందన్నారు. పంట చేతికి వచ్చేవరకు ఇందులో అంతర పంటలు వేసుకోవచ్చన్నారు. ఈ పంటలకు మార్కెట్ మంచి భవిష్యత్ ఉందని ఆయన అన్నారు. రైతు శేషారెడ్డి మాట్లాడుతూ తనకు 32 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా 11 ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈ సాగుకుతో పెట్టుబడి ఖర్చులు ఉండదని, ఈ పంటలను కోతులు, పశువులు పాడు చేసే అవకాశం ఉండదని అన్నారు. పంట సాగుకు ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అన్నారు.
ఆయిల్ పామ్ సాగుపై అవగాహన
జఫర్గఢ్: మండలంలోని కూనూరు, ఉప్పుగల్లు గ్రామాల్లో ఆయిల్ పామ్ సాగుపై గురువారం ఆయా గ్రామాల సర్పంచులు ఇల్లందుల కుమార్, గాదెపాక సువర్ణ అధ్యక్షతన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ కడారి శంకర్, హర్టికల్చర్ అధికారిణి సుష్మిత పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగుపై ఉద్యానవన, పట్టు పరిశ్రమశాఖ, తెలంగాణ రాష్ట్ర సహకార నూనె గింజల ఉత్పత్తి దారుల సమాఖ్య ఆధ్వర్యంలో రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఈపంట సాగుపై దృష్టిసారించాలన్నారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల రైతు బంధు సమితి కోఆర్డినేటర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.