చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ముస్లింలకు దుస్తుల పంపిణీ
ఆరుగురికి కల్యాణలక్ష్మి చెక్కులు..
చొప్పదండి, మే 5: మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణలో రంజాన్ను పురస్కరించుకుని మండలంలోని నిరుపేద ముస్లింలకు బుధవారం దుస్తులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం తెలంగాణ అని పేర్కొన్నారు. అన్ని మతాలను టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు. అన్ని వర్గాల నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు.
సంక్షోభంలోనూ సంక్షేమానికే పెద్దపీట
కరోనా సంక్షోభంలోనూ ప్రజాసంక్షేమానికే పెద్దపీట వేసి నిధులు మంజూరు చేస్తూ ప్రజలకు సేవ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణలో మండలంలోని ఆరుగురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో నిరుపేద ఆడబిడ్డల వివాహాలకు రూ.లక్షా116ను మేనమామ కట్నంగా అందజేస్తూ వారి కుటుంబాలకు కొండంత అండగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని తెలిపారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ రజిత, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, మున్సిపల్ వైస్చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గొల్లపల్లి శ్రావణ్, కౌన్సిలర్ కొత్తూరి మహేశ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, నాయకులు మాచర్ల వినయ్, రాజేందర్ పాల్గొన్నారు.