నియంత్రణకు టాస్క్ఫోర్స్ టీమ్లు
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
ఫిర్యాదు చేయాల్సిన నంబర్లు 72888 94479,72888 94148
పెద్దపల్లి జంక్షన్, జూన్ 4: నకిలీ విత్తనాల నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో పోలీసులు, వ్యవసాయాధికారులతో కలిసి టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశారు. సమాచారం ఇచ్చేందుకు నంబర్లు అందుబాటులో ఉంచారు.
పునాది గట్టిగా లేకుండా భవనానికి మెరుగులు దిద్దినా ప్రయోజనం ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. పం ట సాగు విషయంలో విత్తనమే పునాదిగా భావించి నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. నాసిరకం విత్తనం వేసి.. ఎన్ని రసాయన, సేంద్రియ ఎరువులు, మందులు వేసినా ప్రయోజనం ఉండదనే విషయాన్ని గుర్తించి అన్నదాత ముందుకు అడుగు వేయాలి.
పంటకు ప్రాణం విత్తనం..
విత్తులో సత్తువ ఉంటేనే సరైన దిగుబడి.. లేకుంటే పెట్టుబడులు, శ్రమ వృథా అవుతాయి. నాణ్యమైన విత్తనాలు నాటితే సరైన దిగుబడితో పాటు మద్దతు ధర వస్తుంది. ఖరీఫ్ సాగు పనులు మొదలయ్యాయి. జిల్లాలో వరి, పత్తి ఎక్కువ సాగు అవుతుంది. వరి విత్తనాల్లో పెద్దగా నకిలీ, కల్తీ బెడద లేకున్నా.. పత్తి విత్తనాల్లో నకిలీ, కల్తీ ఉండే అవకాశం లేకపోలేదు. దీంతో పత్తి రైతుపై నకిలీ కత్తి వేలాడుతున్నది. ఇప్పటికే మార్కెట్లోకి పత్తి విత్తనాలు వచ్చాయి. నాణ్యమైనవో.. నకిలీవో తేల్చలేని స్థితిలో ఉన్న రైతులకు, కాసుల కక్కుర్తితో కొందరు నకిలీవి అంటగట్టే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నకిలీ విత్తనాలను నియంత్రించాలనే గట్టి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయాధికారులను అప్రమత్తం చేసింది. జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ టీమ్తో పాటు 14 మండలాల్లో బృందాలను అధికార యంత్రాంగం నియమించింది. నిరంతరం పర్యవేక్షణ చేస్తారు.
నిరంతర పర్యవేక్షణ..
జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణకు కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేశారు. ఇందులో ఏడీఏ (వ్యవసాయ శాఖ అధికారి), పోలీస్శాఖ అధికారి, విత్తన ధ్రువీకరణ అధికారి ఉంటారు. మండల స్థాయి టాస్క్ఫోర్స్ బృందంలో ఏవోతో పాటు ఎస్ఐ సభ్యులుగా ఉంటారు. వీరు వారి పరిధిలో నకిలీ విత్తనాల తయారీ, విక్రయాలపై ప్రత్యేక దృష్టిసారిస్తారు. జిల్లాలోని 54 క్లస్టర్లోని రైతు వేదికల్లో కొవిడ్ నిబంధనలను పాటిస్తూ నకిలీ విత్తనాల నియంత్రణకు రైతులకు అవగాహన కల్పిసున్నారు.
జిల్లాలో నకిలీ విత్తనాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. విత్తన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. రైతులకు సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. క్యూఆర్ కోడ్ ఉన్న విత్తన విక్రయాలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ, మండలానికో మండల స్థాయి టాస్క్ఫోర్స్ టీమ్ను నియమించాం. పత్తి రైతులు విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి. నకిలీ విత్తనాలను ఎవరైన అమ్మితే వెంటనే సంబంధిత వ్యవసాయాధికారి/ పోలీస్ అధికారికి సమాచారం ఇవ్వాలి.
-తిరుమల ప్రసాద్, డీఏవో