నకిలీ విత్తనాలు,ఎరువులు విక్రయిస్తే షాపులు సీజ్
పీడీ యాక్ట్ నమోదు చేస్తాం
పోలీసులు, వ్యవసాయాధికారులు
నిర్మల్ అర్బన్, జూన్ 4 : రైతులను మోసగిస్తే చర్యలు తప్పవని పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరించారు. నకిలీ ఎరువులు, విత్తనాలు, రసాయనాలను విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పట్టణ సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని పలు ఎరువులు, రసాయన దుకాణాల్లో శుక్రవారం తనిఖీలు చేశారు. దుకాణాల్లోని ఎరువుల నిల్వలు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. డీలర్లందరూ ఎప్పటికప్పుడు రోజువారి నివేదికను వ్యవసాయ అధికారులకు అందించాలని సూచించారు.
భైంసా, జూన్ 4 : భైంసాలోని గాంధీ గంజ్లో సీడ్స్ అండ్ జై జయశంకర్ ఫర్టిలైజర్లో పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తనిఖీలు చేశారు. ప్రతి విత్తన బ్యాగుకు సంబంధించి రైతులకు రసీదు ఇవ్వాలన్నారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.
ముథోల్, జూన్, 4 : విత్తనాలను అధిక రేట్లకు విక్రయించరాదని ఎస్సై అశోక్, ఏవో భాస్కర్ సీడ్స్ దుకాణాల నిర్వాహకులకు సూచించారు. ముథోల్తో పాటు ఎడ్బిడ్ తదితర గ్రామాల్లోని విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. వ్యవసాయ శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
తానూర్, జూన్ 4: మండల కేంద్రంలోని పలు విత్తనాల దుకాణాల్లో ఎస్ఐ గుడిపెల్లి రాజన్న తనిఖీలు చేశారు. రైతులు విత్తనాలు,ఎరువులు కొనుగోలు చేసినప్పుడు రసీదులు తప్పకుండా ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట హెడ్ కానిస్టేబుల్ శివరాం ఉన్నారు.
మామడ,జూన్ 4: మండలంలోని తాండ్రలోని ఫర్టిలైజర్ దుకాణాలను ఎస్ఐ వినయ్కుమార్, ఏవో నాగరాజు తనిఖీ చేశారు. అనంతరం బురదపెల్లి,రచ్చకోటలో గిరిజన రైతులకు నకిలీ విత్తనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈవోలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
నార్నూర్,జూన్4: గాదిగూడ మండలంలోని లోకారి(కే)మార్కెట్లో ఫర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి జాడి దివ్య శుక్రవారం తనిఖీ చేశారు. ఆయా షాపుల్లోని రిజిస్టర్లను పరిశీలించారు. ఆమె వెంట ఏఈవో నాగోరావ్, డీలర్లు ఉన్నారు.