మాజీ మంత్రి ఆరోపణలు అవాస్తవం
టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్
హుజూరాబాద్ టౌన్, జూన్ 4: మాజీ మంత్రి ఈటల రాజేందర్ పచ్చి అవకాశవాదని, ఆయన చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవాలని టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్కు టీఆర్ఎస్లో సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పించారన్నారు. అత్యాశతో చెప్పుడు మాటలు విని కన్నతల్లిలాంటి పార్టీని నష్టపరిచారన్నారు. తన భార్య కులం కూడా చెప్పుకోలేని స్థితిలో ఈటల రాజేందర్ రాజకీయాలు చేయడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. సీఎం ఆఫీస్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఐఏఎస్ అధికారులే లేరని అంటున్న ఈటల తన కూతురును బీసీకి ఇచ్చి ఎందుకు పెళ్లి చేయలేదని, కొడుక్కు బీసీ అమ్మాయితో ఎందుకు పెళ్లి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ప్రజలను మభ్యపెట్టిన ఈటల, ఏ ఒక్క నాయకుడిని ఎందుకు ఎదగనివ్వలేదని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని నాయకులను మూడు, నాలుగు గ్రూపులుగా విడదీసి వర్గాలు ఏర్పాటు చేసి రాజకీయ పబ్బం గడిపాడని విమర్శించారు.
సీఎం కేసీఆర్ దయతోనే ఈటల పదవులు అనుభవించాడన్నారు. అసైన్డ్ భూములు చట్టవిరుద్ధంగా కొనుగోలు చేసి, బ్యాంకులను మోసపుచ్చి ఆ భూములపై రుణాలు తీసుకున్నాడన్నారు. దేవరయాంజల్ గుడి భూములను ఆక్రమించిన ఈటలను బీజేపీలో చేర్చుకోవడం పార్టీ దివాళకోరుతనానికి నిదర్శనమన్నారు. హుజూరాబాద్లో ఈటల చరిత్ర ముగిసిన అధ్యాయమని అభివర్ణించారు. మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నాయకత్వంలో హుజూరాబాద్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగుతామన్నారు. ఈటల రాజేందర్కు సీఎం ఎన్నోసార్లు మంచి అవకాశం ఇచ్చినా, దానిని కాపాడుకోకుండా కన్నతల్లి లాంటి పార్టీపైనే కత్తి దువ్వడం ఆయన నీతిమాలిన తీరుకు నిదర్శనమన్నారు. సమావేశంలో జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, హుజూరాబాద్ సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండాల్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మాజీ పట్టణాధ్యక్షుడు పంజాల కుమారస్వామి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ ఎస్సీసెల్ మాజీ మండలాధ్యక్షుడు మొలుగూరి ప్రభాకర్, హనుమాన్ ఆలయ మాజీ చైర్మన్ భూసారపు వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ యూత్ పట్టణాధ్యక్షుడు గందె సాయిచరణ్, తదితరులు పాల్గొన్నారు.