ధర్మారం, జూన్ 3: రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు కేటాయించి ధర్మారం మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గురువారం మంత్రి ఈశ్వర్ పర్యటించారు. డీఎంఎఫ్టీ నిధులు రూ.9.20 లక్షల వ్యయంతో మల్లన్న ఆలయానికి వెళ్లేందుకు సీసీ రోడ్డు నిర్మాణం, ఎంపీపీ కార్యాలయంలో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం రూ. 2 కోట్ల వ్యయంతో జీపీ కార్యాలయం ఎదుట నుంచి ఎస్సారెస్పీ డీ-83/బీ కాలువ వరకు ఆర్అండ్బీ రోడ్డు బీటీ విస్తరణ,రూ. 25 లక్షలతో అంబేద్కర్ స్టడీ సర్కిల్ భవన నిర్మాణం, రూ.20 లక్షలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణం, రూ. 4.60లక్షలతో మున్నూరు కాపు సంఘం మిగుల పనుల పూర్తికి మంత్రి ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి రూ.25 లక్షలతో కొత్తపల్లి వెళ్లే దారిలో నజార్ల బోరు వద్ద అధునాతన వైకుంఠధామం నిర్మాణం, రూ. 4.60 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ ధర్మారం భవిష్యత్తులో పట్టణంగా రూపుదిద్దుకోబోతున్నందున జనాభాకు అనుగుణంగా, ప్రణాళికా ప్రకారం అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
ఇక్కడ టౌన్ హాల్, సమీకృత మార్కెట్ సముదాయం, మహిళా సంఘ భవనం, యువతకు స్టడీ సర్కిల్ ఏర్పాటు, మినీ స్టేడియం నిర్మాణం, జీపీ వారు నిర్మించిన వైకుంఠ ధామంతో పాటు డీఎంఎఫ్టీ నిధులతో అధునాతనంగా రెండో వైకుంఠధామాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ఎస్సారెస్పీ కాల్వ వరకు 4 లేన్ల బీటీ రోడ్డును నిర్మించి సెంట్రల్ లైటింగ్ నిర్మాణం చేయిస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూస్కూరు జితేందర్రావు, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్రెడ్డి, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, ఎంపీటీసీ తుమ్మల రాంబాబు, ఉప సర్పంచ్ ఆవుల లత, వార్డు సభ్యులు, ఆర్అండ్బీ ఈఈ నర్సింహాచారి, డీఈఈ రాములు, ఎంపీడీవో బీ జయశీల, పీఆర్ ఏఈ మల్లేశం, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, జిల్లా సభ్యుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, మండల సభ్యుడు పాక వెంకటేశం, జడ్పీ, మండల కోఆప్షన్ సభ్యులు ఎండీ సలామొద్దీన్, ఎండీ రఫీ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంచాల రాజేశం, ప్రధాన కార్యదర్శి దొనికెని తిరుపతి, పట్టణాధ్యక్షుడు బాస తిరుపతి రావు, ఏఎంసీ డైరెక్టర్లు ఎండీ హఫీజ్, బొంగాని తిరుపతి, ఎంపీటీసీలు మిట్ట తిరుపతి, సూరమల్ల శ్రీనివాస్, నాయబ్ తహసీల్దార్ ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్బాబు, తదితరులు పాల్గొన్నారు.