థోల్, జూన్, 3 : రైతులు విత్తనాలు విత్తే సమయంలో తొందరపడకూడదని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త, సమన్వయ కర్త వీరన్న సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దుక్కులు మంచిగా నీళ్లు తాగిన తర్వాత 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతేనే పత్తి, సోయాపంటలు విత్తుకుంటే మొలకశాతం పెరుగుతుందన్నారు. విత్తనాలు మొలిసిన తర్వాత కూడా వారం, పది రోజుల వరకు వర్షం రాకున్నా మొక్కలు వాడిపోకుండా ఉంటాయని పేర్కొన్నారు. పత్తి, సోయా పంటల్లో కందిని అంతర పంటగా వేసుకుంటే లాభదాయకంగా ఉంటుందని వివరించారు. వానకాలం వరికి ముందుగా పచ్చిరొట్ట ఎరువులు ఎకరాకు 20 కిలోల చొప్పున చల్లుకొని పూర్తి దశలో దున్నుకున్నట్లయితే భూసారం పెరిగి దిగుబడులు అధికంగా వస్తాయని వెల్లడించారు. రైతులు శాస్త్ర వేత్తల సలహాలు, సూచనలు పాటించాలన్నారు.
ఉట్నూర్ రూరల్, జూన్ 3: సరైన వర్షాలు కురవక ముందే రైతులు విత్తనాలు విత్తుకోవద్దని ఏవో రాథోడ్ గణేశ్ అన్నారు. సోయా పంట జూన్ 15 నుంచి 25 వరకు విత్తుకోవాలని సూచించారు. తొందర పడి నేల పూర్తిగా తడవక ముందే విత్తనాలు వేస్తే, మొలక శాతం తగ్గి రైతులు నష్టపోతారని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి సందేహాలున్నా తమను సంప్రదించాలని అన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు
భీంపూర్,జూన్ 3: రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని వ్యవసాయాధికారి రవీందర్ స్పష్టం చేశారు. ఎస్ఐ రవీందర్, ఏఈవోలతో కలిసి భీంపూర్, పిప్పల్కోటి, అర్లి(టీ), కరంజి(టీ) గ్రామాల్లోని పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్ దుకాణాలను గురువారం తనిఖీ చేశారు. స్థానిక రైతులు, వ్యాపారులకు సూచనలు చేశారు. వారి వెంట ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితుల బాధ్యులు, రైతులు ఉన్నారు.
రసీదులు తప్పనిసరి తీసుకోవాలి
తలమడుగు, జూన్ 3 : రైతులు విత్తన దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు రసీదులు తప్పనిసరి తీసుకోవాలని ఏవో మహేందర్ సూచించారు. మండలంలోని కజర్ల, బరంపూర్, దేవాపూర్లోని విత్తన దుకాణాలను గురువారం తనిఖీ చేశారు. స్టాక్ రికార్డులను పరిశీలించారు. లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. డీలర్లు నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రసీదుల ఆధారంగానే పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తామని చెప్పారు.