పెద్దేముల్ మండలంలో 32,098 ఎకరాల్లో పంటల సాగు
పంటలకు జీవం పోసిన వర్షాలు
పెద్దేముల్, ఆగస్టు 2: ఇటీవలి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు మండలంలోని ఆయా గ్రామాల్లో అన్ని రకాల పంటలు ప్రస్తుతం కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా మండల పరిధిలోని మన్సాన్పల్లి, మంబాపూర్, జనగాం, మారేపల్లి, పెద్దేముల్, గాజీపూర్, బుద్దారం, నాగులపల్లి, తింసాన్పల్లి, కందనెల్లి, గొట్లపల్లి, ఇందూరు, హన్మా పూ ర్, గిర్మాపూర్, తట్టేపల్లి, అడికిచెర్ల, బండమీది పల్లి గ్రామాల్లో పం టలు ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నాయి. పెద్దేముల్ మండల పరిధి లోని ఆయా గ్రామాల్లో రైతులు పత్తి, కంది, పెసర, మినుము, మొక్క జొన్న, జొన్న, చెరుకు, వరితో పంటలను సాగు చేస్తు న్నారు. అయితే మండలంలో సుమారు 11,488 ఎకరాల్లో పత్తి పంటను, 11,238 ఎకరాల్లో కంది, 2,972 ఎకరాల్లో పెసర, 1,070 ఎకరాల్లో మినుమ, 389 ఎకరాల్లో మొక్కజొన్న, 490 ఎకరాల్లో జొన్న, 2029 ఎకరాల్లో వరి పంటను, 2,200 ఎకరాల్లో చెరుకు పంటను, 222 ఎకరాల్లో ఇతర పంటలు మొత్తం సుమారు 32,098 ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నారు.
కాగా మండలంలోని ఆయా గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటలకు ఇటీవల కురిసిన వర్షాలు కొంత సత్తువను అందించగా ప్రస్తుతం అన్ని పంటలు కళకళలాడుతున్నాయి. ఏ గ్రామాల్లోనైతే పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచి పంటలు ఎర్రగా మారిపోతే, రైతులు ఆ పంట పొలాలకు 999 స్ప్రే ను ఒకసారి పిచికారీ చేసుకోవాలని వ్యవసాయ అధికా రులు సూచిస్తున్నారు.ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రైతన్నలు పొలాల్లో కలుపుతీసే పనులు, ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు.