నారాయణఖేడ్, ఆగస్టు 2 : రైతులకు అండగా నిలిచి వారిని ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుజాల్పూర్ గ్రామానికి చెందిన రైతు జగతి అంబయ్యకు సంబంధించి రూ.5 లక్షల రైతు బీమా ఖాతా పుస్తకాన్ని ఆయన భార్య జగతి మల్లమ్మకు అందజేసిన సందర్భంగా మాట్లాడారు. మంచి ఆలోచనతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం మృతి చెందిన రైతుల కుటుంబాలకు కష్టకాలంలో ఆదుకుంటుందన్నారు. ఇదే కాకుండా రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు భారంగా మారిన రుణాలను మాఫీ చేసే దిశగా రెండో విడుత రుణమాఫీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించబోతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల విజిలెన్స్ కమిటీ సభ్యుడు చన్బసప్ప, జుజాల్ సర్పంచ్ జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్, కంగ్టి మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సోమవారం నారాయణఖేడ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద ఆడపిల్లల తల్లిదండ్రులకు అండగా నిలిచి కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ. లక్షా 116 అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. పేద ప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మె ల్యే సూచించారు.