త్వరలో అనాథ చిన్నారుల కోసం కొత్త పథకం
విద్య, భద్రతతోపాటు అన్ని విషయాలపై అధ్యయనం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ
కొవిడ్ వల్ల అనాథలైనవారిని సర్కారే చూడాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన
మానసికంగా ధైర్యాన్ని ఇవ్వాలన్నదే సర్కార్ ఉద్దేశం
మంత్రులు సత్యవతి రాథోడ్,సబితా ఇంద్రారెడ్డి
పరిగిలోని బాలసదనాన్ని సందర్శించి చిన్నారుల బాగోగులను అడిగి తెలుసుకున్న మంత్రులు
పరిగి, ఆగస్టు 2 : తెలంగాణ ప్రభుత్వం అనాథ చిన్నారులకు అండగా నిలుస్తున్నదని, వారి బంగారు భవిష్యత్తు కోసం త్వరలో కొత్త పథకం తీసుకురానున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. అనాథల భవిష్యత్ కోసం కేబినెట్ సబ్ కమిటీని వేసిన నేపథ్యంలో సోమవారం పరిగిలోని బాలసదనాన్ని మంత్రులు సందర్శించి మాట్లాడారు. విద్య, భద్రతతోపాటు అన్ని విషయాలపై అధ్యయనం చేసేందుకే ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. పలు విషయాలపై కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కొవిడ్ వల్ల అనాథలైన చిన్నారులను సర్కారే చూడాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. అనాథల ఆలనాపాలనతో పాటు ఉన్నత విద్యనందించి మానసికంగా వారిలో ధైర్యాన్ని నింపాలన్నదే సర్కార్ ఉద్దేశమన్నారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అమ్మాయిని సవతి తల్లి వేధిస్తుంటే సీఎం కేసీఆర్ అక్కడికి వెళ్లి ఆమెను అక్కున చేర్చుకొని చదువు చెప్పించి ఆమెకు పెండ్లి చేశారని గుర్తు చేశారు. అనంతరం అనాథ చిన్నారులతో మంత్రులు ముచ్చటించారు. సమస్యలేమైనా ఉన్నాయా… ఎలా చదువుతున్నారంటూ అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలోని అనాథ పిల్లలకు మంచి భవిష్యత్ను ఇచ్చే విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త పథకం తీసుకురాబోతున్నదని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న 15వేల మంది అనాథ పిల్లలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు సమగ్ర నివేదికను కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి సమర్పించనుందని చెప్పారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన వేసిన కేబినెట్ సబ్ కమిటీ నేపథ్యంలో సోమవారం పరిగిలోని బాలసదనాన్ని మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిలు సందర్శించారు. బాలసదనంలో వసతులు, పిల్లల ఆరోగ్యం, విద్యా సదుపాయాలు, ఆహారం తదితర అన్ని అంశాలను పరిశీలించడంతోపాటు స్వయంగా విద్యార్థినులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారిని అనాథలుగా పరిగణించి, వారి ఆలనాపాలనా, రక్షణ, సంరక్షణ ప్రభుత్వమే చూడాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. కొవిడ్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 200 నుంచి 250 మంది వరకు పిల్లలు అనాథలైనట్లు గుర్తించి, వారికి అవసరమైన సదుపాయాలు, విద్య, చక్కటి భవిష్యత్ను ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారన్నారు. రాష్ట్రంలో 15వేల మంది అనాథ పిల్లలు ఉంటారని అంచనా ఉందని, వారందరూ ప్రభుత్వం ఇస్తున్న ఆశ్రయం, వివిధ స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్న సంస్థల్లో ఉంటున్నట్లు తెలిపారు. కమిటీ నివేదిక తర్వాత అనాథ పిల్లల కోసం మంచి పాలసీ ఈ రాష్ట్రంలో రాబోతుందని చెప్పారు.
పూర్తి భరోసాను కల్పిస్తుంది..
అనాథ పిల్లలకు అమ్మానాన్న ప్రభుత్వమే కావాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారిని గుర్తించామన్నారు. అనాథలందరి తరపున సీఎం కేసీఆర్కు మంత్రి సబితారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనాథ పిల్లలు చదువు, వారికి పూర్తి భరోసా కల్పించే దిశగా నివేదిక ఉండేలా రిపోర్టు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు తమ పరిధిలో ఉన్న ఆశ్రమాలను సందర్శించి అనాథ పిల్లలకు అవసరమైన అన్ని విషయాలను తెలుసుకొని కమిటీకి తెలియజేయాలని మంత్రి కోరారు. పరిగిలోని బాలసదనంలో 29 మంది బాలికలు ఉండగా, వారందరితో మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డిలు మాట్లాడారు. ఈ సందర్భంగా పిల్లలకు మంత్రులు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టి ధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య, కలెక్టర్ పౌసుమిబసు, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి, పరిగి, కులకచర్ల ఎంపీపీలు కె.అరవిందరావు, సత్యమ్మ, జడ్పీటీసీలు బి.హరిప్రియ, రాందాస్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మేడిద రాజేందర్, టీఆర్ఎస్ నాయకులు ఆర్.ఆంజనేయులు, ఎ.సురేందర్కుమార్, మీర్ మహమూద్అలీ పాల్గొన్నారు.