మొదటి ఆరునెలల వరకు బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి
ముర్రుపాలతో బిడ్డకు ఎంతో మేలు
నియోజకవర్గంలో ప్రారంభమైన తల్లిపాల వారోత్సవాలు
ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్టు 2: బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషధం. అమ్మ కౌగిలిలో వెచ్చదనం, పాలలో కమ్మదనం పుట్టిన బిడ్డకు మాత్రమే తెలుస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు అందిస్తే హానికరం అనే అపోహతో కొందరు తల్లులు ముర్రుపాలు ఇవ్వడంలేదు. ఒక దశలో తల్లిపాలకంటే, డబ్బాపాలే మంచివని కూడా అనుకుంటున్నారు. ప్రతిఒక్కరూ డబ్బా పాలు మరిచి తల్లిపాలనే పట్టాలి. వందకుపైగా పోషకాలుండే పాలను బిడ్డకు ఎంత త్వరగా పట్టిస్తే అంత వేగంగా గర్భాశయ కండరాలు సాధారణ స్థితికి చేరుకుంటాయట. ముఖ్యంగా బాలింతలను వేధించే అధిక రక్తస్రావం సమస్య అదుపులో ఉంటుందని పలు పరిశోధనల్లో తెలిసింది. ప్రసవానంతరం కనీసం ఆరునెలల పాటు చనుపాలు ఇవ్వాలి. తరువాత ప్రత్యామ్నాయ ఆహారాన్ని ఎంచుకుంటూనే, మారో ఆర్నెళ్లు కొనసాగించడం వల్ల బిడ్డ ఎదుగుదల మానసిక వికాసం బాగుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
తల్లిపాలతో వ్యాధులు దూరం
తల్లిపాలు అందని పిల్లల్లో ఉబ్బస వ్యాధి లక్షణాలు ఎక్కువని నెదర్లాండ్కు చెందిన పిల్లల వైద్య బృందం తమ అధ్యయనంలో తేల్చింది. కనీసం ఆరునెలలైనా చనుపాలు తాగిన పిల్లల్లో జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులు కనిపించవు. ఈ కొలి సూక్ష్మక్రిములు, ఇతర రోగకారక వైరస్లను ఎదుర్కొనే యాంటిబాడీలు తల్లిపాలల్లో ఉంటాయి. వీటిలో ఉండే ఇమ్యూనోగ్లోబిన్లు, లాక్టోఫెరిస్, లాక్టోపెరాక్సీడేజ్లు శిశువును ఎన్నో రకాలుగా కాపాడుతాయి. డయేరియా, చర్మంపై దద్దుర్లు వంటివి కూడా పిల్లల దరిచేరకుండా శక్తిని ఇస్తాయి. నిద్రలో శిశువుల్లో సంభవించే ఆకస్మిక మరణాలకు అమ్మపాలు అడ్డుకుంటాయి.