రెండో విడుతలో రూ.50వేలలోపు రుణాలు మాఫీ
ఇప్పటికే రూ.25వేలలోపు పంట రుణాలకు వర్తింపు
నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం
ఉమ్మడి జిల్లాలో వేలాది మంది రైతులకు చేకూరనున్న ప్రయోజనం
మరో రెండు విడుతల్లో రూ.లక్ష వరకు రుణమాఫీ వర్తింపు
నిజామాబాద్, ఆగస్టు 2, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనాతో ఆర్థికవ్యవస్థ అతలాకుతలమైనప్పటికీ అన్నదాతల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని రెండో విడుత రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్షలోపు రైతు రుణాలన్నింటినీ నాలుగు విడుతల్లో మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 2018, డిసెంబర్ 11వ తేదీ కన్నా ముందు పంటరుణం తీసుకున్న రైతులందరికీ ఈ మాఫీ వర్తించనుంది. గతేడాది మొదటి విడుతలో రూ.25 వేల లోపు రుణం తీసుకున్న వారికి మాఫీ చేయగా.. తాజాగా రూ.50వేల లోపు రైతులను రుణవిముక్తులను చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. దీంతో ఉమ్మడి జిల్లాలో వేలాదిమంది సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరనున్నది. ఈ నెల 15వ తేదీ నుంచి రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించి నెలాఖరులోగా పూర్తి చేయాలని వ్యవసాయ, ఆర్థిక శాఖలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. మొదటి విడుతలో ఉమ్మడి జిల్లాలో 38వేల మందికి రుణమాఫీ వర్తించింది. నిజామాబాద్ జిల్లాలో 17,711 మంది రైతులకు రూ.20.10 కోట్లు, కామారెడ్డి జిల్లాలో 20,984 మందికి గాను రూ.24.64కోట్ల రుణాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీ చర్యలు ముమ్మరం చేయడంతో రైతన్నల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
రుణ మాఫీని అమలు చేయాలన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో రైతుల్లో ఆనందం వెల్లివిరు స్తోంది. తొలి ప్రభుత్వంలో రుణ మాఫీని సీఎం కేసీఆర్ నాలుగు విడుతల్లో రైతులకు రుణ విముక్తి కల్పించారు. ఈ సారి కూడా రూ.లక్షలోపు రుణాలున్న రైతులకు నాలుగు విడుతల్లో ఈ భారాన్ని తీ ర్చాలని ప్రభుత్వం భావించింది. బ్యాంకుల్లో రైతు లు తీసుకున్న రూ.50వేల లోపు రుణాలను మాఫీ చేయాలని ఆదివారం రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఆగస్టు 15వ తేదీ నుంచి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి, నెలాఖరులోగా పూర్తి చేయాలని వ్యవసాయ, ఆర్థిక శాఖలను కేసీఆర్ ఆదేశించడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతున్నది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కేసీఆర్ సర్కారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని అమలు చేస్తున్నది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం టీఆర్ఎస్ తొలి ప్రభుత్వ హయాం లో రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేసి మాట నిలబెట్టుకున్నది. ఇప్పుడు అదే ఒరవడిని కొనసాగిస్తున్నది.
ఒకవైపు కరోనా మహమ్మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినా… ప్రభుత్వం రైతన్నల సంక్షేమం విషయంలో వెనకడుగు వేయడం లేదు. కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికార పీఠమెక్కిన తర్వాత అమలవుతున్న రుణ మాఫీ ప్రక్రియలో మొదటి విడుతలో రూ.25వేలులోపు రుణాలు మాఫీ అయ్యాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 38,675 మంది రైతులకు రూ.44.74 కోట్లు ప్రయోజనం చేకూరింది.
నెలాఖరులోగా రూ.50వేలలోపు రుణాలు మాఫీ…
అన్నదాతలను అప్పుల ఊబి నుంచి తప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం పంట రుణ మాఫీ ప్రక్రియను తలపెట్టింది. ప్రతి రైతుకు రూ.లక్ష వరకు రుణాన్ని మాఫీ చేస్తామని 2018 శాసనసభ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ మేనిఫెస్టో అంశాన్ని అమలు చేసేలా సీఎం కేసీఆర్ నడుం కట్టారు. 2018, డిసెంబర్ 11వ తేదీ కన్నా ముందు పంట రుణం తీసుకున్న రైతులందరికీ రూ.లక్ష వరకు పంట రు ణం మాఫీ కానుంది. వివిధ బ్యాంకుల ద్వారా రు ణాలు తీసుకున్న రైతులు ఉమ్మడి జిల్లాలో 5.48లక్షల మంది ఉన్నారు. వీరిలో రూ.25వేల లోపు ఉన్న వారి సంఖ్య నిజామాబాద్, కామారెడ్డి జిల్లా లో 38వేల మంది ఉండగా వారందరికీ రుణ మా ఫీ వర్తించింది. సీఎం నిర్ణయంతో రెండో విడుతలో రూ.50వేల లోపు రుణాలు తీసుకున్న వారికి పంట రుణాల మాఫీ చేయబోతున్నారు. వీరి సంఖ్య వేలల్లోనే ఉండనుంది. ఆర్థిక మాంద్యం యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న వేళ రాష్ట్ర ప్రభు త్వం పొదుపు చర్యలతో పాటు ఎన్నికల హామీలను పకడ్బందీగా అమలు చేస్తున్నది. దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమవుతున్నా సీఎం కేసీఆర్ ప్రాధాన్యతా అంశాలకు పెద్ద పీట వేస్తూ ముందుకు సాగుతున్నారు.
వేల మంది కర్షకులకు ప్రయోజనం…
నిజామాబాద్ జిల్లాలో 2018లో రూ.లక్షలోపు రు ణ మాఫీకి అర్హులైన రైతుల సంఖ్య మూడున్నర లక్ష ల వరకు ఉంది. ఇందులో మొదటి దఫాలో రూ.25వేల లోపు పంట రుణాలు తీసుకున్న వారి కి లాభం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో రూ.25వేల లోపు రుణాలు స్వీకరించిన 17,711 మంది రైతులకు రూ.20.10 కోట్ల మేర రుణ మా ఫీ మొదటి విడుతలో జరిగింది. రెండో విడుతలో నూ భారీగానే రైతుల సంఖ్య ఉండనుంది. కామారెడ్డి జిల్లాలో రూ.25వేలలోపు రుణ మాఫీకి నోచుకున్న రైతులసంఖ్య భారీగా ఉంది. జిల్లాలో మొ త్తం 1,98,224 మంది రైతులు పంట రుణాలను తీసుకున్నారు. వీరికి రూ.లక్ష రుణ మాఫీ వర్తించనుంది.ఇందులో తొలి విడుతలో రూ.25 వేలులోపు తీసుకున్న సన్న, చిన్న కారు రైతులకు పంట రుణాలు రద్దు చేశారు. సీఎం నిర్ణయంతో కామారెడ్డి జిల్లాలో 20,984 మంది రైతులకు సంబంధించిన రూ.24.64కోట్ల రుణాలను ప్రభుత్వం రద్దు చేసింది. రెండో దఫా కింద రూ.50వేలలోపు పం ట రుణాలను రద్దు చేయబోతుండడంతో వేలాది మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. ఉ మ్మడి జిల్లాలో మొదటి విడుతలో 38,695 మంది కి రూ.44.74 కోట్లు మేర రుణ మాఫీ వర్తించింది.
సన్న, చిన్న రైతులకు మేలు…
ఉమ్మడి జిల్లాలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. ఎకరం నుంచి రెండున్నర ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబాలు సగానికి ఎక్కువ మందే ఉన్నారు. పంట సీజన్లో సామాన్య రైతులకు పెట్టుబడికి పైసల్లేక సాగును వదిలేసిన వారు ఎందరో. గతంలో కూలీనాలి చేసుకుంటూ పొట్ట పోసుకుని జీవించేవారు. రాష్ట్రంలో రైతులకు ఆర్థిక స్వాతంత్య్రం లభించింది. పంట రుణాలు మాఫీ, రైతుబంధు, రైతు బీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు, నిరంతర విద్యుత్, సాగు నీటి సౌకర్యం వంటి చర్యలతో రైతు రాజ్యం కనిపిస్తున్నది. కేసీఆర్ పాలనలో పంటల సాగు విస్తీ ర్ణం పెరగడంతో పాటు ఉత్పత్తి సైతం గణనీయం గా పెరిగింది. నాలుగేండ్ల క్రితం వరకు సాగు లాభదాయకంగా లేకపోవడంతో వేరే ఉపాధికి వెళ్లిన వారే ఇప్పుడు పొలం పనుల్లో బిజీ అవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 2019 వానకాలంలో 2.39లక్షల మంది రైతులు మాత్రమే ఉన్నారు. ఇదే ఏడాదిలో యాసంగికి ఈ సంఖ్య 2.55లక్షల కు చేరింది. 2021 వానకాలానికి రైతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రైతుబంధు ద్వారా 2,61, 273 మందికి లబ్ధి చేకూరడం విశేషం. కామారెడ్డి జిల్లాలోనూ 2019 వానకాలంలో 2.49 లక్షల మంది ఉండగా, ఇదే ఏడాది యాసంగికి 2.60 లక్షలకు రైతులు పెరిగారు. ప్రస్తుతం 2021 వానకాలం సీజన్ నాటికి 2,69,592 మంది రైతులు ఉండడం విశేషం.