హాలియా;హాలియాలో సోమవారం నిర్వహించిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రగతి సమీక్షా సమావేశానికి హాజరైన సీఎం కేసీఆర్కు ఘనస్వాగతం లభించింది. టీఆర్ఎస్ కార్యాలయం నుంచి మార్కెట్ యార్డు వరకు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, కళాకారులు పూలుచల్లుతూ, పటాకులు కాల్చుతూ స్వాగతం పలికారు. పట్టణ ప్రజలు సీఎం సమావేశానికి వెళ్లే దారిలో బిల్డింగ్లపై నిలబడి పెద్దఎత్తున ‘జై కేసీఆర్, జై తెలంగాణ’ నినాదాలతోపాటు రెండు చేతులతో సీఎంకు అభివాదం చేశారు. నియోజకవర్గంలోని దళిత నాయకులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి పెద్ద ఎత్తున డప్పులు కొడుతూ స్వాగతం పలికారు. ‘దళిత బాంధవుడు సీఎం కేసీఆర్’ అని పెద్దఎత్తున నినాదాలు చేశారు. స్వాగతం పలికిన నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, కళాకారులకు సీఎం కేసీఆర్ ప్రత్యేక బస్సులో నుంచి అభివాదం చేశారు.
భారీ బందోబస్తు
గుర్రంపోడు, ఆగస్టు 2 : ప్రగతి సమీక్షా సమావేశానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2వేల మంది సిబ్బందిని మోహరించారు. వివిధ జిల్లాల నుంచి ముగ్గురు ఎస్పీలు, ఆరుగురు ఏఎస్పీలు, 15మంది డీఎస్పీలు, 60 మంది సీఐలు, 230 మంది ఎస్ఐలు, 1800 మంది కానిస్టేబుళ్లు, 50 మంది స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, 150 మంది స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వాహనాలను సమావేశ స్థలానికి అర కిలోమీటరు దూరంలో పార్క్ చేయించారు. హాలియాకు వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు.అనుమానాస్పద వ్యక్తులనుఅదుపులోకి తీసుకున్నారు. సభకు హాజరైన ప్రజాప్రతినిధుల పాస్లను తనిఖీ చేసి లోనికి పంపించారు.