కలెక్టరేట్ స్థలంలో రూ.300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన
కలెక్టరేట్ భవనం వైద్య శాఖకు అప్పగింత
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్, ఆగస్టు2: మహబూబ్నగర్ను మెడికల్ హబ్గా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ను కలెక్టర్ వెంకట్రావుతో కలిసి మంత్రి పరిశీలించారు. కలెక్టరేట్ భవనంతోపాటు స్థలాన్ని వైద్య శాఖకు అప్పగిస్తూ అందుకు అవసరమైన ఉత్తర్వులను సంబంధిత అధికారులకు మంత్రి, కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నట్లు తెలిపారు. అందుకోసమే భవనాన్ని వైద్య శాఖకు అప్పగించామన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాలో సమీకృత భవన సముదాయాన్ని నిర్మింపజేస్తున్నారని, అందులో భాగంగానే అన్ని శాఖల కార్యాలయాలు ఉండేలా పాలమూరులో చర్యలు చేపట్టామన్నారు. పాత కలెక్టరేట్ కార్యాలయాన్ని గత కలెక్టర్ రొనాల్డ్రోస్ ఉన్న సమయంలో చిల్డ్రన్స్ దవాఖాన ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రూ.కోటి ఖర్చు అవుతుందని ప్రణాళిక రూపొందించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి పాత కలెక్టర్ భవనాన్ని తొలగించి జిల్లాకు రూ.300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న జిల్లా జనరల్ దవాఖాన, ఇప్పుడు నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానతో ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎంతో మేలు చేకూరుతున్నదన్నారు. బస్టాండ్ నుంచి నేరుగా దవాఖానలోకి వచ్చేలా లిప్టు ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. గతంలో వైద్యం కోసం జిల్లా నుంచి హైదరాబాద్లోని ఉస్మానియా, నిమ్స్ దవాఖానలకు అంబులెన్స్లో వెళ్లేవారని, మధ్యలో అంబులెన్సులు చెడిపోయి పలువురు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయన్నారు. నూతన దవాఖాన నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. అభివృద్ధికి కేరాఫ్గా మహబూబ్నగర్ను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ జనరల్ దవాఖాన డాక్టర్ రాంకిషన్, డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణ, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, తాసిల్దార్ పార్ధసారథి పాల్గొన్నారు.