పోలీసుల హెచ్చరికలు
మంచిర్యాల జిల్లాలో పలుచోట్ల ఎరువులు, విత్తనాల దుకాణాల తనిఖీ
మందమర్రి జూన్ 2 : నకిలీ పత్తి విత్తనాలు, గడువు దాటిన పురుగు మందులను విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వాయపారులను మంచిర్యాల జిల్లా పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయా చోట్ల ఎరువులు, విత్తనాల దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని ఎరువులు విత్తనాల దుకాణాలను వ్యవసాయ అధికారి గ్లాడ్స్టాన్తో కలిసి ఎస్ఐ లింగంపెల్లి భూమేశ్ తనిఖీ చేశారు. క్రిమిసంహారక మందులు, పత్తి విత్తనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు, నకిలీ మందులు విక్రయించి రైతులను మోసం చేయాలని చూస్తే దుకాణా యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై తరుచుగా దుకాణాల్లో తనిఖీలు చేపడుతామని తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండి వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు పాటించాలన్నారు. వారి సహకారంతోనే విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. కొందరు గ్రామాల్లో తిరుగుతూ రైతులకు మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలను అంటగట్టే ప్రయత్నం చేస్తారన్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు సంబంధిత దుకాణాల్లో బిల్లులు తీసుకోవాలని సూచించారు.
లక్షెట్టిపేటలో ఎస్ఐ చంద్రశేఖర్..
లక్షెట్టిపేట రూరల్, జూన్ 2 : లక్షెట్టిపేట పట్టణంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో మండల వ్యవసాయాధికారి చల్ల ప్రభాకర్రెడ్డితో కలిసి ఎస్ఐ చంద్రశేఖర్ తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, రైతులను మోసం చేసినా ఎంతటివారైనా సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిషేధించిన విత్తనాలు, మందులు అమ్ముతున్న
ట్లుగా తమ దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట వ్యవసాయ, పోలీసు శాఖల సిబ్బంది, ఫర్టిలైజర్ షాపుల యజమానులు ఉన్నారు.
తాండూర్లో ఎస్ఐ కిరణ్కుమార్..
తాండూర్, జూన్ 2 : తాండూర్ మండల కేంద్రంలోని బాలాజీ, శ్రీలక్ష్మి, జై హనుమాన్ ఫర్టిలైజర్ దుకాణాలను తహసీల్దార్ కవిత, వ్యవసాయాధికారి కిరణ్మయితో కలిసి ఎస్ఐ సీహెచ్ కిరణ్కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వానకాలం పంటల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశానుసారం ముందస్తుగా తనిఖీలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. నకిలీ విత్తనాలు అమ్మవద్దని, ప్రభుత్వం ధ్రువీకరించిన వాటినే విక్రయించాలని సూచించారు. లేకపోతే కేసులు పెడుతామని హెచ్చరించారు. అనుమతి పొందిన దుకాణాల వద్దనే రైతులు విత్తనాలు కొనుగోలు చేసుకోవాలని, తప్పకుండా రసీదు తీసుకోవాలని సూచించారు. సీజన్ ప్రారంభమైన తర్వాత పొలాల్లోకి వచ్చి పంటలను పరిశీలించినప్పుడు తప్పకుండా రసీదు పత్రాలను సంబంధిత అధికారులకు చూపించాలన్నారు. లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తన దుకాణాలు, గోదాములను పరిశీలించి స్టాకు, అమ్మకం నిల్వలు, షాపు లైసెన్స్, స్టాకు రిజిస్టర్, బిల్ పుస్తకాలను పరిశీలించారు.
కోటపల్లిలో సమీక్షా సమావేశం..
కోటపల్లి, జూన్ 2 : కోటపల్లి రైతు వేదికలో బుధవారం మండలంలోని విత్తన, ఎరువుల దుకాణాల యజమానులతో తహసీల్దార్ శ్రీనివాస్రావ్ దేశ్పాండే, ఏవో మహేందర్, ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. నకిలీ విత్తనాల వల్ల రైతులకు కలుగుతున్న నష్టాన్ని వివరించారు. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిందన్నారు. మహారాష్ట్ర నుంచి నకిలీ పత్తి విత్తనాలు వచ్చే అవకాశం ఉందని, ఈ విషయంలో డీలర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.