ఈ సారి రూ.50వేలలోపు రుణం తీసుకున్న వారికి
ఉమ్మడి జిల్లాలో 66వేల మందికి ప్రయోజనం
ఈనెల 15 తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
నల్లగొండ, ఆగస్టు 1 : రైతులు తీసుకున్న పంట రుణాలను రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా మాఫీ చేస్తున్నది. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నప్పటికీ రైతుల కోసం నిధులు విడుదల చేయనున్నది. ఆదివారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రైతులు తీసుకున్న రుణంలో రూ.50వేల లోపు ఉన్న వాటిని మాఫీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తొలి దఫాలో రూ.25వేల రుణాలు తీసుకున్న వారికి ప్రభుత్వం మాఫీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో సుమారు 66వేల మంది రైతులకు సంబంధించిన రూ.200 కోట్లు మాఫీ అయ్యే అవకాశం ఉంది. ఈనెల 15 నుంచి 31 వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
66వేల మందికి ప్రయోజనం
రుణమాఫీలో రెండో విడుతగా రూ.50వేల లోపు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ చేస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే తొలి విడుతలో ఉమ్మడి జిల్లాలో 28వేల రైతులకు సంబంధించి రూ.42.50 కోట్లు మాఫీ చేయగా.. ఈ సారి రెండో విడుతగా 66వేల మంది రైతులకు సంబంధించి రూ.200కోట్ల రుణాలు మాఫీ కానున్నాయి.
ఎన్నికల హామీలో భాగంగానే
2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ మరో సారి అధికారంలోకి వస్తే రైతులు తీసుకున్న రుణాల్లో రూ.లక్ష వరకు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. హామీ అమలులో భాగంగా ఇప్పటికే తొలి దఫా కింద ఉమ్మడి జిల్లాలో 28వేల మంది రైతుల రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం, ప్రస్తుతం రెండో విడుత కింద మరో 66వేల మందికి సంబంధించిన రుణాలను మాఫీ చేయనున్నది.