చేర్యాల, ఆగస్టు 1 : పట్టణంలో మున్సిఫ్ కోర్టు ఏర్పాటుకు భౌగోళికంగా, వసతుల పరంగా అన్ని అనుకూలతలు ఉన్నాయని చేర్యాల ప్రాంత న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. చేర్యాలలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటును కోరుతూ ఆదివారం చేర్యాల ప్రాంత న్యాయవాదులు సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల కేసులు జనగామ జిల్లా కోర్టులో 1600 వరకు పెండింగ్లో ఉన్నాయన్నారు. పూర్వపు వరంగల్ జిల్లాలో చేర్యాల కొనసాగిన సమయంలో ఉన్న పెండింగ్ కేసులను ప్రస్తుతం సిద్దిపేటకు బదిలీ చేస్తున్నారని, ఈ క్రమంలో ప్రజలు ఇటు జనగామ, అటు సిద్దిపేటకు ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. చేర్యాలలో కోర్టు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. సమావేశంలో న్యాయవాదులు భూమిగారి మనోహర్, ముస్త్యాల స్టీవెన్, ఆరెళ్ల వీరమల్లయ్య, ఆరెళ్ల మహేందర్, మేరుగు రమేశ్, నల్లగొండ సంతోశ్, పొన్నం సురేశ్, దర్శనం ప్రశాంత్, అంకని సురేందర్, గుస్క వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.