ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ దృష్టికి పరిస్థితి
స్పందించిన కలెక్టర్ శశాంక
గ్రామాన్ని సందర్శించిన అధికారులు
గంగాధర, జూన్ 1: మండలంలోని ఒద్యారం గ్రామంలో మే 31వ తేదీన 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఆరోగ్య శాఖ అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో గ్రామంలోని పరిస్థితిని వివరిస్తూ వాట్సాప్ ద్వారా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్కుమార్ దృష్టికి తీసుకువెళ్లినట్లు జాగృతి రాష్ట్ర కార్యదర్శి బాలసంకుల అనంతరావు మంగళవారం తెలిపారు. దీంతో వారు గ్రామంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయాలని కలెక్టర్ శశాంకకు సూచించినట్లు చెప్పారు. గ్రామంలోని పరిస్థితిని తెలియజేయగానే స్పందించిన ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్కు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కరోనా బాధితులకు చికిత్స అందించాలని, జాగృతి ఆధ్వర్యంలో వారికి భోజన వసతి ఏర్పాటు చేస్తామని అనంతరావు పేర్కొన్నారు. కాగా, గ్రామాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జువేరియా, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో భాస్కర్రావు సందర్శించారు. గ్రామంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడానికి గల కారణాలను స్థానిక వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రెండు మూడు రోజుల తర్వాత గ్రామంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి మరిన్ని నిర్ధారణ పరీక్షలు చేస్తామన్నారు. ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు కోసం ప్రభుత్వ పాఠశాలను తహసీల్దార్, ఎంపీడీవో పరిశీలించారు. ఇక్కడ ఎంపీవో జనార్దన్రెడ్డి, సర్పంచ్ ములుకుంట్ల సంపత్, ఆరోగ్య సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.