పట్టించుకోని నీటిపారుదల శాఖ అధికారులు
ఖిల్లాఘణపురం, జూలై 31 : గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు తోడు ఎంజీకేఎల్ఐ సాగునీరు కత్వ నుంచి పిల్లివాగుకు వదిలే సమయంలో మల్కినియాన్పల్లి గ్రామ శివారులోని ఐదు సంవత్సరాల కిందట పిల్లివాగుపై నిర్మించిన గణపముద్రం డైవర్షన్ కెనాల్ కూలిపోయింది. దీంతో పిల్లివాగుకు ఇరువైపులా ఉన్న రైతు పొలాలు సాగునీటితో కోతలకు గురయ్యాయి. అక్కడ ఉన్న సన్నకారు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై స్థానిక రైతులు గత సంవత్సరం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన మంత్రి జిల్లా నీటిపారుదల శాఖ అధికారులకు కత్వ మరమ్మతులు వెంటనే చేపట్టి రైతులకు మేలు చేయాలని సూచించారు. కత్వకు 100 మీటర్ల దూరంలోనే మరో రెండు చెక్డ్యాంల ఏర్పాటుతోపాటు పిల్లివాగుపై నిర్మించిన చెక్డ్యాం నీరు ఎక్కువగా రావడంతో కొట్టుకుపోయింది.
దాదాపు పది ఎకరాలకు పైగా పంటలు కోతకు గురయ్యాయి. కత్వకు మరమ్మతులు చేపడితే వాలాద్రీ వాగు ద్వారా ఖిల్లాఘణపురంలోని గణపసముద్రానికి సాగునీరు అందించేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాటు కాలువ ద్వారా చెరువుకు సాగునీరు వెళ్తుంది. గణపసముద్రం చెరువు ఆయకట్టు కింద దాదాపు 2వేల ఎకరాలకు పైగా పంట పొలాలు సాగులోకి వస్తాయి. దీంతోపాటు మండలంలోని ఆగారం, వెంకటాంపల్లి, మహ్మదుస్సేన్పల్లి, కమాలుద్దీన్పూర్ చెరువులకు సాగునీరు వెళ్లేందుకు సులభంగా ఉంటుంది. దీనికి తోడు మూసాపేట మండలంలోని వివిధ గ్రామాలకు కూడా సాగునీరు వెళ్లేందుకు ఈ కత్వ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కత్వ మరమ్మతులు చేపట్టకపోతే చుట్టుపక్కల ఉన్న రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లినా కూడా అధికారులు స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు కత్వ సమీపంలో గుంతలు ఏర్పడ్డాయని ఈ ఏడాది కూడా భారీ వర్షాలు పడితే దిగువనున్న రైతులకు ఇబ్బందులు తప్పవు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి కత్వ మరమ్మతులు చేపట్టి ఆయా గ్రామాలకు వెళ్లే సాగునీరు సునాయసంగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు.