వేగంగా నిండుతున్న నాగార్జున సాగర్
574 అడుగులకు చేరిన నీటిమట్టం
నేటి సాయంత్రం గేట్లు ఎత్తే చాన్స్!
సాగునీటి విడుదలకు ఏర్పాట్లు
శ్రీశైలం నుంచి భారీగా వరద
నల్లగొండ ప్రతినిధి, జూలై 31 (నమస్తే తెలంగాణ) ;నాగార్జునసాగర్ చరిత్రలో మరో అరుదైన సందర్భం ఆవిష్కృతం కానున్నది. ఎగువ కృష్ణా నుంచి భారీ వరద ఇలాగే కొనసాగితే ఆదివారం సాయంత్రం, లేదంటే సోమవారం ఉదయానికి ప్రాజెక్టు గేట్లు తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఆగస్టు చివర, లేదా సెప్టెంబర్లో సాగర్కు భారీ వరదలు వచ్చి గేట్లు ఎత్తుతుంటారు. ఈ సీజన్లో మాత్రం ఇప్పటికే పైనున్న ప్రాజెక్టులన్నీ నిండగా, శ్రీశైలం 10 గేట్ల ద్వారా 4.54లక్షల క్యూసెక్కుల నీరు సాగర్కు వస్తున్నది. దాంతో 24 గంటల్లోనే 33 టీఎంసీల వరదతో నీటిమట్టం 14 అడుగుల మేర పెరిగి శనివారం సాయంత్రం 6గంటలకు 574 అడుగులకు చేరుకున్నది. మరో 16 అడుగులు నిండితే పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు తాకి ఇంత ముందస్తుగా గేట్లు తెరుచుకోవడం రికార్డు కానున్నది.
నల్లగొండ ప్రతినిధి, జూలై 31 (నమస్తే తెలంగాణ) నాగార్జునసాగర్కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వస్తున్నది. శ్రీశైలానికి ఎగువ నుంచి 5.37లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తున్నది. మూడ్రోజుల కిందటే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో 10గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతోపాటు విద్యుత్తు ఉత్పత్తి ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. గత రెండ్రోజుల నుంచి సగటున నాలుగన్నర లక్షల క్యూసెక్కుల నీరు సాగర్కు వచ్చి చేరుతుండడంతో సాగర్లో వేగంగా నీటిమట్టం పెరుగుతున్నది. శనివారం సాయంత్రానికి శ్రీశైలం నుంచి సాగర్కు 4,54,734 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తున్నది. సాగర్లో శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు 560అడుగుల మేర 232 టీఎంసీల నీరు నిల్వ ఉంటే శనివారం సాయంత్రానికి 574 అడుగులకు చేరుకుని 265 టీఎంసీల నీటి నిల్వకు పెరిగింది. అంటే కేవలం 24గంటల్లో 14అడుగుల మేర నీటిమట్టం పెరిగి 33టీఎంసీల నీరు అదనంగా వచ్చి చేరాయి. ఇంత వేగంగా నీరు రావడం అంటే అసాధారణ విషయమే. 2009లో భారీ వరదల సమయంలో మినహా తరువాత ఎప్పుడూ ఇంతటి వరద లేదని ప్రాజెక్టు అధికారులు వెల్లడిస్తున్నారు. సాగర్ నిండాలంటే పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు చేరుకోవాలి. అది ఇంకో 16అడుగుల దూరంలో ఉంది. ఈ 24గంటల పాటు వరద ఇలాగే కొనసాగితే ఆదివారం సాయంత్రానికి సాగర్ నీటిమట్టం 585 అడుగులు దాటనున్నది.
సాధారణంగా ఎగువ నుంచి వచ్చే వరద ఇలాగే స్థిరంగా కొనసాగితే ఈ దశలోనే గేట్లను తెరిచే అవకాశాలు ఉంటాయి. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో 3నుంచి 5 అడుగుల ముందస్తుగానే గేట్లను ఎత్తే ప్రణాళికతో ఉంటారు. ఈ నేపధ్యంలోనే సాగర్ క్రస్ట్గేట్లు ఆదివారం సాయంత్రానికే తెరుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లేనిపక్షంలో సోమవారం తెల్లవారుజామున తప్పనిసరిగా గేట్లు ఎత్తాల్సిందే. ఇప్పటికే సాగర్లో పవర్ జనరేషన్ ద్వారా నీరు దిగువకు వెళ్తుండడంతో పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో కనువిందు చేస్తుంది. పులిచింతల ప్రాజెక్టు గేట్లను ఇప్పటికే ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ గేట్లు ఎత్తే అవకాశాలు ఉండడంతో ఈ ఉదయం పులిచింతల మరిన్ని గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కృష్ణానదిలో ఎగువన వర్షాల ప్రభావం కొనసాగుతుండడంతో కొద్దిరోజులపాటు భారీ వరదపోటు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే నాగార్జునసాగర్ వద్ద కూడా జలదృశ్యం ఈ సీజన్లో చాలా రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు సాగర్ గేట్లు తెరుచుకోనున్న నేపథ్యంలో సాగర్ కుడి, ఎడమకాల్వలకు సాగునీటి విడుదల కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సీజన్లోనూ రెండు పంటలకు సమృద్ధిగా నీరు అందనుంది. ఈసారి వరినాట్లు కూడా ముందుకు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నార్లు పోసుకున్న రైతాంగం దుక్కులు దున్ని నాట్లకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఏఎమ్మార్పీ, వరద కాల్వలకు ఈ నెల 10నుంచి సాగునీటిని విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే వీటికి కూడా ముందస్తు నీటి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎన్ఎస్పీ సీఈ శ్రీకాంత్రావు
నందికొండ : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నాగార్జునసాగర్ రిజర్వాయర్కు వచ్చి చేరుతుందని, రెండ్రోజుల్లో నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్నెస్పీ సీఈ శ్రీకాంత్రావు అన్నారు. శనివారం క్రస్ట్ గేట్లను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ డ్యామ్ 26 క్రస్ట్ గేట్లలో 4గేట్లను గతంలో మరమ్మతులు చేయించామని, ఈ ఏడాది మిగిలిన గేట్లకు రూ.70 లక్షలతో పనులను చేయించామన్నారు. 2009 నుంచి ఇప్పటివరకు వరద ఈ స్థాయిలో రావడం ప్రథమన్నారు. ఆయన వెంట ఎస్ఈ ధర్మానాయక్, ఈఈ సత్యనారాయణ, డీఈ పరమేశ్, ఏఈఈ కృష్ణయ్య, ఎస్పీఎస్ ఆర్ఐ పవన్కుమార్ ఉన్నారు.
టెయిల్పాండ్ 6 గేట్ల నుంచి నీటి విడుదల
అడవిదేవులపల్లి : టెయిల్పాండ్ ప్రాజెక్టుకు సాగర్ నుంచి 35,371 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు ఏడీ నరసింహారావు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 5 క్రస్ట్గేట్లను 0.83 మీటర్ల మేర, 1 క్రస్ట్ గేట్ను 1.25 మీటర్ల మేర ఎత్తి 34,923 క్యూసెక్కుల నీటిని దిగువనున్న పులిచింతలకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. టెయిల్పాండ్ నీటి నిల్వ సామర్థ్యం 7.080 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.963 టీఎంసీలు ఉన్నది.
పులిచింతల@173.259
చింతలపాలెం : పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175.00 (45.77 టీఎంసీలు) అడుగులకు గాను ప్రస్తుతం 173.259 (43.1097 టీఎంసీలు) అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 38,701 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. విద్యుత్ కేంద్రం గేట్ల నుంచి 13,200 క్యూసెక్కులు, పులిచింతల ఒకటో గేటు నుంచి 24,901 క్యూసెక్కులు, గేట్ల లీకేజీల ద్వారా 600 క్యూసెక్కుల నీరు.. మొత్తం 38,701 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది.
639 అడుగుల్లో మూసీ నీటిమట్టం
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి శనివారం 1,323 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 (4.46 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 639.45 (3.09 టీఎంసీలు) అడుగుల వద్ద నిల్వ ఉంది. కుడి, ఎడమ కాల్వలకు 630 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది.