సమస్యల పరిష్కారానికే బాల అదాలత్
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాసరావు
బాల అదాలత్కు 490 ఫిర్యాదులు
నాగర్కర్నూల్, జూలై31: బాల అదాలత్ కార్యక్రమాన్ని యజ్ఞంలా కొనసాగించి మారుమూల ప్రాంతా ల్లో సమస్యలు ఎదుర్కొంటున్న పిల్లల ముందుకు వెళ్తామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు. శనివారం నాగర్కర్నూల్లోని వెలమ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఒకరోజు బాల అదాలత్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బాలలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం, భవిష్యత్లో పిల్లలకు సమస్యలు రాకుండా అరికట్టడమే బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రధాన కర్తవ్యమన్నారు. కమిషన్ సభ్యులు దేవయ్య, రాగజ్యోతి, బృందాధరరావు, శోభారాణి, అంజన్రావు, అపర్ణతో కలిసి బాలల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో జరిగిన బాల అదాలత్ కార్యక్రమానికి 490 ఫిర్యాదులు వచ్చాయన్నారు.
ఫిర్యాదులను వందశాతం పరిష్కరించేందుకు కలెక్టర్ చొరవ తీసుకోవాలని కోరారు. త్వరలో మన్ననూర్లో బాల అదాలత్ నిర్వహిస్తామన్నారు. పిల్లల హక్కులను కాపాడటానికి పిల్లల తల్లిదండ్రులతోపాటు జిల్లా, పోలీస్ యంత్రాంగం కృషి చేస్తున్నదన్నారు. అంతకుముందు కలెక్టర్ శర్మన్ మాట్లాడుతూ జిల్లాలో గిరిజనులు, చెంచులు అధికంగా ఉండి మౌలికంగా వెనుకబడిన జిల్లాలో పిల్లలకు విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిల్లలకు వారి హక్కులపై అవగాహన కల్పించడానికి బాలల హక్కుల పరిరక్షణ కమిటీతోపాటు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయని తెలిపారు. అలాగే స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహార పదార్థాల స్టాళ్లను వారు పరిశీలించారు. కమిషన్ సభ్యులను జిల్లా కలెక్టర్ శాలువా, మెమెంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వెంకటలక్ష్మి, సీడబ్ల్యూసీ అధ్యక్షుడు లక్ష్మణ్రావు, డీసీపీవో ఇంతియాజ్, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.